
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్ నుంచే మొత్తం 10 జట్లతో లీగ్ను ఆడించాలని బీసీసీఐ చూస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలవాలనుకుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో.. టెండర్ల ప్రక్రియ కూడా జరగలేదు. లీగ్ ముగిసేలోపే రెండు కొత్త జట్లకు సంబందించిన టెండర్ల ప్రక్రియ పూర్తిచేద్దామనుకున్నా అది సాధ్యంకాలేదు.
ఇక సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచులు యూఏఈలో ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 15తో లీగ్ ముగియనుంది. ఈ లోపే రెండు కొత్త జట్లకు సంబందించిన టెండర్ల ప్రక్రియను బీసీసీఐ పూర్తిచేయనుందని సమాచారం తెలుస్తోంది. రెండు కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీల కనీస విలువ 2000 కోట్లు అని ఓ జాతీయ మీడియా పేర్కొంది. వచ్చే సీజన్ నుంచి రెండు జట్లు చేరనుండడంతో బీసీసీఐకి భారీ ఆదాయం రానుంది. 15వ సీజన్లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం. ప్రస్తుతం కంటే 1000, 15000 కోట్లు అదనంగా ఆదాయం రానుందని తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్ను 10 జట్లకు పెంచాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా.. సమయం లేకపోవడంతో అది కుదరలేదు. ఇక కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు, స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనూ లీగ్లో పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. 2011లో 10 జట్లతో లీగ్ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది.
రెండు కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఐపీఎల్ 2022 టెండర్ పత్రం సెప్టెంబర్ నెలాఖరులో విడుదల కానుందని తెలుస్తోంది. అక్టోబర్ మధ్యలో బిడ్ల (ప్రాంచైజీలను) ఆహ్వానం, డిసెంబర్ మాసంలో మెగా యాక్షన్ జరగనుందని సమాచారం. ఇక జనవరి 2022లో మీడియా హక్కులు బీసీసీఐ ఇవ్వనుంది. ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది. వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో ముగ్గురు భారతీయులు మరియు 1 విదేశీ ప్లేయర్.. లేదా ఇద్దరు భారతీయులు మరియు ఇద్దరు విదేశీలు ఉండే అవకాశం ఉంది. ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు.. ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి.
ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు బీసీసీఐ పెంచింది. అంటే 10 ఫ్రాంచైజీల నుంచి రూ.50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ.. 2024కు ఈ జీతాల నిధిని రూ.100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ దుబాయ్ చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.