
ఐపీఎల్ మెగా వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త. లీగ్లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్గా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లోని కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. వార్నర్ ఒక్కడు మాత్రమే కాదు ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా కూడా లీగ్లోని కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ వార్త తెలిసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు వార్నర్ మెగా లీగ్కు దూరమవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. త్వరలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. ఈ క్రమంలో అక్కడ ఇరు జట్లు మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి.
ఐపీఎల్ 15వ ఎడిషన్ మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఐపీఎల్ 2022 మార్చి చివర్లో ప్రారంభం అవుతుందని ఇది వరకే ఒకసారి స్పష్టం చేశారు. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేకుండా మార్చి చివర్లోనే ఐపీఎల్ ప్రారంభమైతే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండడం కష్టమనే చెప్పుకోవాలి. ఏప్రిల్ 5 నాటికి వారు పాకిస్థాన్ పర్యటన ముగించుకుని భారత్ వచ్చి కరోనా నిబంధనలు పూర్తి చేసుకునే సరికి ఆరంభ మ్యాచ్లు అయిపోతాయి. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవాకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్, గ్లెయిన్ మాక్స్వెల్, ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, స్టీవెన్ స్మిత్ వంటి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ఆడనున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ శనివారం, ఆదివారం జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ్రాంచైజీలన్నీ కూడా మెగావేలానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 590 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 10 జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. దీంతో మెగా వేలం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.