
గాయపడ్డ సింహంలా..
శనివారం నాటి ప్రారంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఓడిపోయింది. కోల్కత చేతిలో దారుణ పరాభవాన్ని చవి చూసింది. కోల్కత బౌలర్లను ఎదుర్కొనలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. రెండో మ్యాచ్ నాటికి బౌన్స్ బ్యాక్ కావడానికి కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ హిస్టరీలో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్.. పరిస్థితి ప్రస్తుతం గాయపడ్డ సింహంలా మారింది. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనిపించేలా తయారవుతోందా టీమ్.

జట్టుతో కలిసిన మొయిన్ అలీ..
ఈ పరిస్థితుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్కు గుడ్ న్యూస్ అందింది. ఆల్రౌండర్ మొయిన్ అలీ జట్టుతో కలిశాడు. టీ20 స్పెషలిస్ట్ ఆల్రౌండర్ ఈ ఇంగ్లాండ్ ప్లేయర్. కోల్కత నైట్ రైడర్స్తో జరిగిన తొలి మ్యాచ్కు అతను అందుబాటులో లేడు. క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి రావడం వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇవ్వాళే ముంబై గడప తొక్కాడు. జట్టుతో కలిశాడు. మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఇతర సహచర్ ప్లేయర్లను పలకరించాడు. ఆ వెంటనే ప్రాక్టీస్లో దిగాడు. నెట్ ప్రాక్టీస్లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

లక్నోతో రెండో మ్యాచ్..
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తన రెండో మ్యాచ్ను గురువారం ఆడనుంది. కొత్తగా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ను ఢీ కొట్టబోతోంది. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. రెండో మ్యాచ్లో మొయిన్ అలీకి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్టే. అతని కోసం ఎవరు తన స్థానాన్ని త్యాగం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మొయిన్ అలీని ఆధారంగా చేసుకుని తుది జట్టులో మార్పులు చేర్పులు ఉంటాయి. కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహిస్తోన్న లక్నో సూపర్ జెయింట్స్కు కూడా అది రెండో మ్యాచ్ అవుతుంది. తొలి మ్యాచ్లో ఇవ్వాళ గుజరాత్ టైటన్స్తో తలపడనుంది.


Click it and Unblock the Notifications
