

గాయపడిన ఆటగాళ్లంతా ఆశ్చర్యకరంగా ఐపీఎల్ వేలానికి ముందు ఫిట్గా మారిపోతారని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ గొప్ప ఫిజియోథెరపిస్ట్లా పని చేస్తుందని ఎద్దేవా చేశాడు. ఇది తన భావన మాత్రమే కాదని, చాలా మంది క్రికెట్ వర్గాల్లో కూడా ఇదే భావని ఉందని చెప్పాడు. సాధారణ ప్రజలు సైతం ఇదే అనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు డబ్బుల గురించి మరిచిపోయి ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, యువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే బాధ్యత జట్టు కెప్టెన్లపై తప్పకుండా ఉంటుందని రవి శాస్త్రి తెలిపాడు.
ఇక టీమిండియాకు భవిష్యత్లో కెప్టెన్సీ చేయాలని ఆశిస్తున్న ఆశావాహులు ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి అన్నాడు. టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్లను అన్వేషించడమే ఈ ఐపీఎల్ ప్రత్యేకత అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో కెప్టెన్లుగా ఉన్న రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్కు భవిష్యత్లో టీమిండియా కెప్టెన్సీ చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయని అన్నాడు. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా నడిపిస్తున్నాడని కొనియాడాడు. ఐపీఎల్కు ముందు వరకు వెంకటేశ్ అయ్యర్ గురించి ఎవరికీ తెలియదని, కానీ ప్రస్తుతం జాతీయ జట్టులో ఆడుతున్నాడని, ఇదే ఐపీఎల్ ప్రత్యేకత అని ఆయన చెప్పాడు. ఐపీఎల్ వల్ల కొత్త ఆటగాళ్లను కనిపెట్టడం సులభమైందని అన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా? లేదా? అని ఈ ఐపీఎల్లో అతడిని దేశమంతా గమనిస్తుందని రవి శాస్త్రి చెప్పాడు.
ఇక ఐపీఎల్ 2022కు సర్వ సిద్ధమైంది. క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో 3 రోజుల్లో ఈ పొట్టి పార్మాట్ ప్రారంభం కాబోతుంది. రెండు నెలలపాటు క్రికెట్ ఫ్యాన్స్కు ఇక ప్రతి రోజు పండగే అని చెప్పుకోవాలి. ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో లీగ్ మ్యాచ్లే 70 ఉండగా.. ప్లేఆఫ్ మ్యాచ్లు 4 ఉన్నాయి. ఈ నెల 26న జరగనున్న తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి.