బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వేలంలో తాజాగా మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. గతంలో సన్రైజర్స్ తరఫునే ఆడిన అబిషేక్ శర్మను వేలంలో రైజర్స్ తిరిగి దక్కించుకుంది. ఈ క్రమంలో అభిషేక్ను గతంలో కంటే భారీ ధరకు కొనుగోలు చేసింది. మొత్తంగా వేలంలో సన్రైజర్స్ ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఆరో ఆటగాడు అభిషేక్ శర్మ. అలాగే వేలంలో రిటైన్ చేసుకున్న మూడో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కూడా కావడం గమనార్హం. కాగా మెగా వేలంలోకి 20 లక్షల కనీస ధరతో వచ్చిన అభిషేక్ శర్మను సన్రైజర్స్ హైదరాబాద్ ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరి 6 కోట్ల 50 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో గతంలో కంటే అభిషేక్కు సన్రైజర్స్ ఏకంగా 5 కోట్ల 95 లక్షల రూపాయలను అధికంగా చెల్లించనుంది.
కాగా అభిషేక్ శర్మకు సన్రైజర్స్ హైదరాబాద్ భారీ ధర వెచ్చించడం పట్ల నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతగా రికార్డులు లేని అభిషేక్ శర్మకు అంత భారీ ధర అవసరమా అని నెటిజన్స్ మండిపడుతున్నారు. సన్రైజర్స్ ఓనర్ను ఉద్దేశిస్తూ అయ్యో కావ్య పాప పాపం అంటూ రాసుకొస్తున్నారు. అనామక ఆటగాడైనా అభిషేక్ శర్మకు అంత ధర అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అనామక ఆటగాడైనా అభిషేక్ శర్మకు అనవసరంగా కోట్ల రూపాయలు తగిలేసారని మండిపడుతున్నారు. ఇతర ఫ్రాంచైజీలు బిగించిన ఉచ్చులో సన్రైజర్స్ ఓనర్లు చిక్కుకున్నారని అంటున్నారు. అయ్యో కావ్య పాప ఇలా అయితే ఎలా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఐపీఎల్లో ఇది వరకే సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్ శర్మకు పెదగా రికార్డులేమి లేవు. ఆల్రౌండర్ అనే పేరు ఉన్నప్పటికీ గొప్పగా రాణించింది లేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఆడి బ్యాటర్గా 17 సగటుతో 241 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 46 పరుగులు. ఇక బౌలర్గానూ పెదగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పటివరకు 7 వికెట్లు మాత్రమే తీశాడు. సన్రైజర్స్ శనివారం నాటి వేలంలో అభిషేక్ శర్మతోపాటు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, పూరన్, నటరాజన్, ప్రియమ్ గార్గ్ను కొనుగోలు చేసింది.