
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలానికి మరొక రోజు మాత్రమే ఉండడంతో ఆటగాళ్ల కొనుగోలుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రాణించిన విండీస్ ఆల్రౌండర్ ఓడియన్ స్మిత్ మెగా వేలంలో 4 నుంచి 5 కోట్ల రూపాయల ధర పలుకుతాడని జోస్యం చెప్పాడు. వేలంలో అన్ని జట్లు స్మిత్ కోసం ప్రయత్నిస్తాయని, అతను ప్రస్తుతం క్రేజీ ఆటగాడిగా మారాడని ఆయన తెలిపాడు. స్మిత్ బౌలింగ్తోపాటు బ్యాటింగ్ కూడా చేయగలడని చెప్పుకొచ్చాడు. కాగా మెగా వేలంలో ఈ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కోటి రూపాయల బేస్ ప్రైజ్తో ఉన్నాడు.
ఇండియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫాస్ట్ బౌలర్ ఓడియన్ స్మిత్ రాణించాడు. బౌలింగ్ రెండు కీలక వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ను ఔట్ చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన స్మిత్ 29 పరగులు ఇచ్చి రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్లోనూ కీలక సమయంలో విలువైన పరుగులను జోడించాడు. 20 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఒక ఫోర్, 2 సిక్సులు బాదాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. కానీ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో రెండు భారీ సిక్సులు కొట్టి ఆకట్టుకున్నాడు. అయితే కీరన్ పొలార్డ్ గాయపడడంతో అతని స్థానంలో స్మిత్ బరిలోకి దిగాడు. కాగా ఈ నెల 12, 13వ తేదీలలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ఓడియన్ స్మిత్తోపాటు 24 మంది వెస్టిండీస్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
25 ఏళ్ల ఓడియన్ స్మిత్ 2016లో వెస్టిండీస్ U19 తరఫున ప్రపంచకప్లో ఆడాడు. ఆల్ రౌండర్ హోదాలో 2018లో వెస్టిండీస్ సీనియర్ జట్టులో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున 4 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో స్మిత్ గత ఏడాది 11 మ్యాచ్లలో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా నిలిచాడు.