
సమష్టి వైఫల్యం..
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ముందు వరకు తొమ్మిదింట్లో ఒక్క మ్యాచ్ను మాత్రమే ఓడింది గుజరాత్. ఎనిమిదింట్లో ఘన విజయాలను సాధించింది. దీనికి ప్రధాన కారణం- బ్యాటింగ్.. బౌలింగ్ సమష్టిగా రాణించడం. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆ రెండు కొరవడ్డాయి. బ్యాటర్లు, బౌలర్లు విఫలం అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లను కోల్పోయి 143 పరుగులు చేయగా.. పంజాబ్ రెండు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

గిల్-సాహా మళ్లీ..
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు మళ్లీ విఫలం అయ్యారు. ఇదివరకు శుభ్మన్ గిల్కు తోడుగా మాథ్యూవేడ్ ఇన్నింగ్ను ఆరంభించేవాడు. అతను విఫలం కావడం వల్ల వృద్ధిమాన్ సాహాను తుదిజట్టులోకి తీసుకుంది. ఈ ప్రయోగం ఒకట్రెండు మ్యాచ్లల్లో సత్ఫలితాలను ఇచ్చింది గానీ.. నిలకడగా కొనసాగట్లేదు. సాహా-గిల్ ద్వయం మళ్లీ విఫలమైంది. గిల్-9, సాహా 21 పరుగులు చేశారు. 44 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయిన తరువాత ఇక బ్యాటింగ్ పతనానికి బ్రేకులు పడలేదు.

మిల్లర్-తెవాతియా విఫలం..
టాప్ ఆర్డర్లో క్రీజ్లోకి దిగిన సాయి సుదర్శన ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోశాడు. చివరి వరకు నిలిచాడు. 50 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్తో 65 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో కంచుకోటలా ఉంటూ వచ్చిన డేవిడ్ మిల్లర్-రాహుల్ తెవాతియా ద్వయం కూడా త్వరగానే పెవిలియన్ దారి పట్టింది. ఇద్దరూ కలిసి తలా 11 పరుగులు చేశారు. వీరిద్దరు విఫలం కావడం గుజరాత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోవడానికి ప్రధాన కారణమైంది.

రషీద్ ఖాన్ గోల్డెన్ డక్..
లోయర్ ఆర్డర్లో భారీ షాట్లతో విరచుకుపడే రషీద్ ఖాన్దీ అదే పరిస్థితి. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. అతనిది గోల్డెన్ డక్. కగిసొ రబడ ఆఫ్ స్టంప్కు కాస్త అవతలికి సంధించిన బంతిని సింగిల్ ఆడటానికి ప్రయత్నించాడు రషీద్. టైమింగ్ మిస్ అయ్యాడు. అది బ్యాట్ను ముద్దాడుతూ నేరుగా వెళ్లి వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లో వాలింది. రెండు బంతలకు రెండు వికెట్లను తీసుకున్నాడు రబడ. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన ప్రదీప్ సంగ్వాన్ గానీ, లోకీ ఫెర్గూసన్ గానీ కుదురుకోలేదు. ఇలా వచ్చి అలా వెళ్లారు.

నిప్పులు చెరిగిన రబడ..
ఈ మ్యాచ్లో రబడ నిప్పులు చెరిగాడు. బుల్లెట్లాంటి బంతులను సంధించాడు. తొలిసారిగా విశ్వరూపం చూపాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి- నాలుగు వికెట్లు పడగొట్టాడు. వృద్దిమాన్ సాహా, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్ వికెట్లు తీసుకున్నాడు. అర్ష్దీప్ సింగ్, రిషి ధవన్, లియామ్ లివింగ్స్టొన్ అతనికి తమవంతు సహకారాన్ని అందించారు. ఈ ముగ్గురూ ఒక్కో వికెట్ కూల్చారు. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు విఫలం అయ్యారు. 16 ఓవర్లల్లోనే రెండు వికెట్లను కోల్పోయి కొట్టేసింది పంజాబ్.


Click it and Unblock the Notifications












