
సమష్టిగా సత్తా..
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు భారీ స్కోర్ను నమోదు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్-84, హార్దిక్ పాండ్యా-31, డేవిడ్ మిల్లర్-20 రాణించారు. 44 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయిన దశలో నుంచి గుజరాత్ బ్యాటర్లు అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్ ఇందుకు హెల్ప్ చేసింది. 27 బంతుల్లో నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేశాడు కేప్టెన్.

డెత్ ఓవర్లల్లో ఫర్వాలేదనిపించిన ఢిల్లీ బౌలర్లు..
అతను అవుట్ అయినప్పటికీ పెద్దగా తేడా రాలేదు. శుభ్మన్ గిల్- మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పరుగుల వేగాన్ని కొనసాగించారు. 19 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 18వ ఓవర్లో గిల్ అవుట్ కావడంతో స్పీడ్ తగ్గింది. రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్ వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో- స్కోర్ బోర్డు మందగించింది. ముస్తాఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ రెండు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీసుకున్నారు.

ఓపెనర్ల విఫలం..
ఛేజింగ్ దిగిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లిద్దరూ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ తన వైఫల్యాన్ని ఈ మ్యాచ్లోనూ కొనసాగించాడు. మూడు పరుగులకే వెనుదిరిగాడు. పృథ్వీ షా పరిస్థితీ ఇంతే. అతని వ్యక్తిగత స్కోర్ 10. వన్డౌన్ బ్యాటర్ మన్దీప్ సింగ్ సైతం విఫలం కావడంతో 34 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి- తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది ఢిల్లీ.

రిషభ్ పంత్ ఒంటరిపోరాటం..
ఢిల్లీ బ్యాటింగ్ తీరు అభిమానులను ఏ మాత్రం సంతృప్తి పర్చలేదు. రిషభ్ పంత్ సాగించిన ఒంటరిపోరాటం వృధా అయింది. మిడిల్ ఆర్డర్ ఉండీ లేదనిపించింది. లలిత్ యాదవ్-25, రౌమన్ పావెల్-20 పరుగులు చేశారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు క్రీజ్లో నిలదొక్కుకుని ఉన్నా ఫలితం వేరుగా ఉండేది. ఆ 14 పరుగుల కొరతను తీర్చుకోవడానికి అవకాశం దక్కి ఉండేది. రిషభ్ పంత్ భారీ షాట్లను ఆడాడు. 29 బంతుల్లో ఏడు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. అతనికి సహకారం అందించే బ్యాటర్ మరొకరు లేకపోవడం ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం.

రన్ అవుట్తో మరింత కుదేల్..
లేని పరుగు కోసం లలిత్ యాదవ్ బలి అయ్యాడు. పంత్.. స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన బంతిని అభినవ్ మనోహర్ మెరుపులా అడ్డుకోవడం, దాన్ని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు విసరడం, బౌలర్ విజయ్ శంకర్ బెయిల్స్ ఎగరేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. క్రీజ్కు చేరుకోవడానికి లలిత్ యాదవ్ డైవ్ చేసినా ఫలితం లేకుండా లేదు. అతని తరువాత వచ్చిన అక్షర్ పటేల్ రెండు ఫోర్లతో దూకుడుగా కనిపించినప్పటికీ.. లోకీ ఫెర్గూసన్ వేసిన బంతికి వికెట్ల వెనుక దొరికిపోయాడు. లో క్యాచ్ను వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అద్భుతంగా అందుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ రెండు పరుగులకే వెనుదిరగడంతో ఓటమి ఖాయమైంది.

కేప్టెన్గా ఫెయిల్యూర్
అంతకుముందు 44 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన దశలో గుజరాత్ టైటాన్స్ను మరింత ఒత్తిడికి గురి చేసే విషయంలో రిషభ్ పంత్ సక్సెస్ కాలేకపోయాడు. గుజరాత్ బ్యాటర్లు ఏకంగా 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ జట్టు నిలదొక్కుకోవడానికి కారణమైంది. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో రిషభ్ పంత్ వేసిన వ్యూహాలేవీ ఫలించలేదు. శుభ్మన్ గిల్ దూకుడును అడ్డుకుని ఉండి ఉంటే ఢిల్లీ బాబుల పరిస్థితి మరోలా ఉండేది. గిల్ జోరుకు సకాలంలో అడ్డుకట్ట వేసేలా పంత్ బౌలర్లను వినియోగించుకోలేకపోయాడు.


Click it and Unblock the Notifications












