
స్కోర్ బోర్డు ఉరకలు..
నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 205 పరుగులు చేసింది. తన ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. తన అద్భుతమైన ఫామ్ను ఇక్కడా ప్రదర్శించాడు. 57 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 41, దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 32 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులెత్తింది.

కంబైన్డ్ ఎఫెక్ట్..
120 బంతుల్లో 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే మాటలు కాదు. దీని కోసం ప్రతి బ్యాటర్ శ్రమించాల్సి ఉంటుంది. కమిట్మెంట్తో ఆడాల్సి ఉంటుంది. ప్రతి బంతి నుంచి పరుగులను రాబట్టుకోవాల్సి ఉంటుంది. అదే చేశారు పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు. కేప్టెన్ మయాంక్ అగర్వాల్-32, శిఖర్ ధవన్-43, భానుక రాజపక్స-43, లియామ్ లివింగ్స్టోన్-19, మహ్మద్ షారుఖ్ఖాన్-24, ఒడియన్ స్మిత్-25 జట్టును విజయ తీరాలకు చేర్చారు.

కొండంత లక్ష్యాన్ని కరిగించేలా..
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల పట్టుదల ముందు భారీ లక్ష్యం చిన్నబోయింది..మంచులా కరిగిపోయింది. ఇంకా ఆరు బంతులు మిగిలివుండగానే 208 పరుగులు చేశారు పంజాబ్ బ్యాటర్లు. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రాజ్ బావా మినహా.. క్రీజ్లోకి దిగిన ప్రతి బ్యాటర్ కూడా సత్తా చాటారు. వందకు పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. ఉన్నంత సేపూ దూకుడుగా ఆడారు. ఒక్క బంతినీ వృధా చేయలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 22 ఎక్స్ట్రాలను సమర్పించుకోవడం కూడా ఆ జట్టు కొంపముంచింది.

స్ఫూర్తినిచ్చిన ఆ సినిమా..
ఇంతలా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోవడానికి ప్రధాన కారణం.. ఓ సినిమా. దాని పేరు 14 పీక్స్. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అనేది దాని ట్యాగ్లైన్. నేపాలీ ఇంగ్లీష్ మూవీ ఇది. ఏడు నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించడం అనే పాయింట్ మీద తెరకెక్కించిన సినిమా. ఎవరెస్ట్, కాంచనగంగ, మకాలు, ధౌలాగిరి, నంగా పర్వత్ వంటి శిఖరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ అత్యున్నత పర్వాతాలను అధిరోహించే క్రమంలో ఎదురైన కష్ట, నష్టాలపై ఇందులో చూపించారు.

మ్యాచ్కు ముందు సినిమా చూసిన ప్లేయర్స్
మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టు మొత్తం ఈ సినిమా చూసింది. కోచ్ అనిల్ కుంబ్లే ప్రత్యేకంగా దీన్ని స్క్రీనింగ్ చేయించారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో కొండంత లక్ష్యాన్ని ఊది పారేశారు ప్లేయర్లు. తనను ఈ మూవీ ప్రభావితం చేసిందని ఒడియన్ స్మిత్ వ్యాఖ్యానించాడు. తాము కూడా 14 మ్యాచ్ల అవరోధాన్ని అధిరోహిస్తామని, విజేతగా ఆవిర్భవిస్తామని చెప్పాడు. తమను ఇన్స్పైర్ చేయడానికి కోచ్ అనిల్ కుంబ్లే ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించారని పేర్కొన్నాడు.

చెలరేగిన స్మిత్..
సిరాజ్ వేసిన 18వ ఓవర్లో ఒడియన్ స్మిత్ దుమ్ము రేపాడు. 8 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 312.50. మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో చెలరేగిపోయాడీ విండీస్ వీరుడు. సిరాజ్ వేసిన ఆ ఓవర్ తొలిబంతికి సిక్స్ బాదాడు. రెండో బాల్ వైడ్. ఆ ఎక్స్ట్రా బంతిని ఫోర్గా మిలిచాడు స్మిత్. మూడు, చివరి బంతులను ఫెన్సింగ్ దాటించాడు. ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. ఓవర్ వేయడానికి ముందు 170 పరుగుల వద్ద ఉన్న పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డు.. అది ముగిసేసరికి 195 వద్దకు వచ్చి చేరింది.


Click it and Unblock the Notifications

