
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రధాన స్పాన్సర్గా వ్యహరిస్తున్న చైనీస్ మొబైల్ కంపెనీ 'వివో' మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివో తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న క్రేజ్ తమ ఉత్పత్తుల ప్రమోషన్కు ఉపయోగపడుతుందని ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు వివో వెల్లడించింది.
టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివో సంస్థ పేర్కొంది. విరాట్ కోహ్లీ తన కాంట్రాక్ట్లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వివరించింది. వివో ప్రస్తుతం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లు షియోమీ, శాంసంగ్లకు వివో గట్టి పోటీనిస్తోంది.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కింద సీజన్కు రూ.440 కోట్లు చెల్లించే విధంగా వివో ఐదేళ్లు (2022 వరకు) కాంట్రాక్టు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. దాంతో ఐపీఎల్ 2020 సీజన్కు డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. ఇందుకోసం డ్రీమ్ 11 బోర్డుకు రూ.222 కోట్లు చెల్లించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులలో మార్పులు రావడంతో వివో మళ్లీ ప్రధాన స్పాన్సర్గా వ్యహరిస్తోంది.
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న వివో.. విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వివో ప్రస్తుతం ఐపీఎల్ అఫిషియల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. చెన్నై వేదికగా ఈ నెల 9న జరుగనున్న లీగ్ ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ సారధ్యంలోని బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢీకొంటుంది.