ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ ప్రతి సారథికి ముఖ్యమైనదే అని, అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరింత ముఖ్యమైందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలి తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ బాగానే ఆడినా.. యూఏఈలో వెనకపడిపోయే అవకాశం ఉందన్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మేలో అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సందడి మళ్లీ షూరూ కాబోతుంది. ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు ఆదివారం (సెప్టెంబర్ 19) చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ప్రారంభం కానుంది.
ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీకి చెత్త రికార్డే ఉంది. 2013లో ఆర్సీబీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ.. ఇప్పటివరకు జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. 2016 సీజన్లో అద్వితీయమైన ఆటతో జట్టును ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేర్చగలిగాడు. ఆ తర్వాత మళ్లీ గత సీజన్లో ప్లే ఆఫ్స్ వరకూ చేరుకోగలిగినా.. టైటిల్ ఫైట్కు మాత్రం తీసుకోలేకపోయాడు. 2017, 2019లో అయితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2018లో మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 'ఈ సాలా కప్ నమ్దే' అనుకుంటూ రావడం, ఒట్టి చేతులతో వెళ్లడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది.
తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ అనేక విషయాలపై స్పందించాడు. 'ఐపీఎల్ అనేది ప్రతి సారథికి ముఖ్యమైనదే. అది విరాట్ కోహ్లీకి మరింత ముఖ్యమైందని నేను భావిస్తాను. ఎందుకంటే.. అతడికి విపరీతమైన అభిమాన గణం ఉంది. ప్రతిఒక్కరూ అతడు ఆర్సీబీకి ట్రోఫీ అందించాలని అనుకుంటారు. కనీసం ఒక్కసారైనా అది సాధించాలని ఆశిస్తారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఈ ఏడాది బెంగళూరు విజేతగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే యూఏఈలోని స్లో పిచ్లు బెంగళూరుకు ఇబ్బందిగా మారొచ్చు' అని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ పేర్కొన్నాడు.
'ఐపీఎల్లో మిగిలిన సీజన్ యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో గతేడాది లాగే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్గా కనిపిస్తున్నాయి. అక్కడి స్లో పిచ్లు బెంగళూరుతో సహా చెన్నైకి కూడా ఇబ్బందిగా మారొచ్చు. భారత్లో చెన్నై సగటు స్కోర్ 201 పరుగులుగా నమోదైంది. అదే యూఏఈలో అయితే ఆ జట్టు అంతగా రాణించలేదు. ఈసారి కప్పు సాధించేది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్సే. చివరగా రాబోయే ఐపీఎల్లో ఇషాన్ కిషన్, దేవ్దత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ల బ్యాటింగ్ చూడాలనుకుంటున్నా. ఒకవేళ పడిక్కల్ బాగా ఆడితే వచ్చే టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంది' అని వీరూ.చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాప్లో దుమ్మురేపిన ఆర్సీబీ.. టైటిల్ ఆశలు రేకెత్తిస్తుంది. ఫస్టాఫ్లో 7 మ్యాచ్ల్లో 5 విజయాలందుకున్న ఆజట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే సెకండాఫ్లో ఏడు మ్యాచ్ల్లో మూడింటిలో నెగ్గినా ప్లేఆఫ్ చేరొచ్చు. దీంతో ఈసారైనా ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉన్న ఈసారి కూడా ఆర్సీబీ ఫైనల్కు చేరడంలో విఫలమైతే.. ఇక అంతే సంగతులు. కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్బై చెప్పే అవకాశాలు మెరుగవుతాయి.