
సెహ్వాగ్, ఓజా డిబేట్:
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్ అనంతరం క్రిక్బజ్ షోలో టీమిండియా మాజీ ఆటగాళ్లు ప్రజ్ఞాన్ ఓజా, వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ జట్టుపై పలు విషయాలు మాట్లాడారు. రాజస్థాన్ జట్టులో 11 మంది కలిసి కట్టుగా ఫీల్డ్లో విజయం కోసం కృషి చేయడం లేదని.. వ్యక్తిగత ప్రదర్శన, వ్యక్తిగత నిర్ణయాలతో ఎవరికి వారే అన్నట్లు ఉన్నారని ఓజా అన్నాడు. సెహ్వాగ్ కూడా ఓజా అభిప్రాయంతో ఏకీభవించాడు. శాంసన్ను సారథిగా చేయడం పట్ల రాజస్థాన్ జట్టు క్యాంపులో నిరూత్సాహం నెలకొందని వీరూ పేర్కొన్నాడు.

చాలామందికి ఇష్టం లేదు:
'రాజస్థాన్ జట్టులో సంజూ శాంసన్ ఒకవైపు, మిగతా వారు మరొకవైపు ఉన్నారు. జట్టులో ఏమాత్రం సఖ్యత లేదు. శాంసన్ను కెప్టెన్ చేయడం ఆర్ఆర్ క్యాంప్లో చాలామందికి ఇష్టం లేదు. అప్పటివరకూ తమతో ఉన్నవాడు ఉన్నట్టుండి కెప్టెన్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక బౌలర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు అతనితో కలిసి చర్చించాలి. బౌలర్పై బ్యాట్స్మన్పై ఎదురుదాడికి దిగినప్పుడు కెప్టెన్గా బాధ్యత ఉంటుంది. బౌలర్ వద్దకు వెళ్లి అతన్ని కంఫర్ట్ జోన్లోకి తీసుకురావాలి. ఇదేమీ సామ్సన్ చేయడం లేదు' అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

పంత్ సూపర్:
'ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథి రిషబ్ పంత్లో ఈ తరహా విధానం చూశాను. ఇలా చేస్తే బౌలర్కు ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడు బ్యాట్స్మన్ను ఇబ్బంది పెట్టే అవకాశమూ దొరకుతుంది. రాజస్థాన్ డగౌట్లోని విదేశీ ఆటగాళ్లు కూడా సంజూ శాంసన్తో సరిగా కమ్యూనికేట్ కావడం లేదు. రాజస్థాన్ ఒక టీమ్గానే కనబడుటం లేదు' అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. పంత్, శాంసన్ ఐపీఎల్ 2021లో సారథులుగా చేస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ చేయడం ఇద్దరికి ఇదే మొదటిసారి.

స్మిత్పై వేటు.. శాంసన్ను బాధ్యతలు:
ఐపీఎల్ 2020లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ విఫలమయిన విషయం తెలిసిందే. అతని సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ గతేడాది 14 మ్యాచ్లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ల్లో 311 పరుగులు చేసిన స్మిత్.. బ్యాట్స్మన్గానూ ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూ.12.4 కోట్ల భారీ ధరకు తీసుకున్న రాజస్థాన్.. స్మిత్పై వేటు వేసింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ను తమ నూతన సారథిగా నియమించింది.


Click it and Unblock the Notifications
