ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో యూనివర్సల్ బాస్, బర్త్ డే బాయ్ క్రిస్ గేల్కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ ఆడాడు. అంతేకాకుండా ఫ్యాబియన్ అలెన్, ఆదిల్ రషీద్లకు రాహుల్ చోటిచ్చాడు. దాంతో ఇప్పటికే సత్తాచాటిన షారుఖ్ ఖాన్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా లాంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్పై భారత మాజీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు.
ఐపీఎల్ 2021 తొలి దశ ఆగిపోయే సమయానికే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. జట్టులో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మహమ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్లు ఉన్నా.. పంజాబ్ నిలకడైన ప్రదర్శన చేయలేకపోయింది. బ్యాటింగ్లో పంజాబ్ బలమైన టాప్-4 కలిగి ఉన్నందున బౌలింగ్ కాంబినేషన్ కోసం కెప్టెన్ కేఎల్ రాహుల్ తరచూ ప్లేయింగ్ ఎలెవన్ను మార్చుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం షారుఖ్ ఖాన్, రవి బిష్ణోయ్, దీపక్ హుడాలను పక్కనబెట్టాడు. ఒక్కోసారి స్టార్ ఆటగాళ్లను కూడా తుది జట్టు నుంచి తప్పించేందుకు రాహుల్ వెనకాడడం లేదు. ఇందుకు మంచి ఉదాహరణే క్రిస్ గేల్. గతేడాది కూడా గేల్ సగం సీజన్ అనంతరం మ్యాచులు ఆడాడు. తరచూ ప్లేయింగ్ ఎలెవన్ను మార్చడంతో పంజాబ్ ప్లేయర్స్ సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారు.
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్తో మాట్లాడుతూ... 'పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ను అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే మొదటి ఏడు మ్యాచులలో పంజాబ్ పదేపదే బౌలింగ్ విభాగాన్ని మార్చింది. పంజాబ్ ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటుందో, ఎవరిని తప్పిస్తుందో చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను బౌలింగ్ని బలంగా చేసుకొవడానికే ఈ ప్రయత్నాలు అన్ని. గేల్, పూరన్, అగర్వాల్ మరియు రాహుల్తో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. వారు తమ ప్రదర్శనతో జట్టును గెలిపించడంలో సహాయపడగలరు. కాబట్టి పంజాబ్ బౌలింగ్ని కూడా పటిష్టంగా ఉంచుకోవడం ముఖ్యం. ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే.. క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడమే కాకుండా పరుగులు కూడా చేయగలడు' అని పేర్కొన్నాడు.
'రాజస్థాన్ రాయల్స్ కాస్త స్థిరమైన జట్టే అని చెప్పాలి. పంజాబ్ కింగ్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను తరచూ మార్చుతుంటుంది. ప్రస్తతం రాజస్థాన్ జట్టుకు చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు అందుబాటులో లేరు. కాబట్టి ఆ జట్టుకి ప్లేయింగ్ ఎలెవన్ను మారడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఒక ఆటగాడికి 2-3 మ్యాచ్లు అవకాశం ఇస్తారు. కానీ ప్రతి మ్యాచ్ తర్వాత పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్ మారుతూ ఉంటుంది. పిల్లలకు కూడా ఊరికే డైపర్లను మార్చరు.. కానీ కింగ్స్ పంజాబ్ మాత్రం తన ప్లేయింగ్ ఎలెవన్ను ఎప్పుడూ మార్చుతుంటుంది' అని వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు.
PBKS vs RR: రెండో బ్యాట్స్మన్గా కేఎల్ రాహుల్ అరుదైన ఘనత!!