అలవోకగా..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పడుతూ లేస్తూ సాగింది రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్. ఓపెనర్లు ఎవాన్ లెవిస్, యశశ్వి జైస్వాల్ మినహా మరెవరూ రాణించలేకపోయారు. వన్డౌన్ బ్యాట్స్మెన్, కేప్టెన్ సంజు శాంసన్ 19, చివరిలో క్రిస్ మోరిస్ 14 పరుగులు చేశాడు. అంతే.. మిగిలిన బ్యాట్స్మెన్లెవ్వరూ డబుల్ ఫిగర్ను అందుకోలేకపోయారు. ప్లే ఆఫ్స్లో నిలవలాంటే రాజస్థాన్ రాయల్స్ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.
బౌలర్ల ప్రతాపం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. జట్టులో ఏడుమంది బౌలర్లు బౌలింగ్ చేశారు. స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ తప్ప మిగిలిన వారందరూ వికెట్లను తీశారు. సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన జార్జ్ గార్టన్ వికెట్ పడగొట్టాడు. మూడు ఓవర్లకు 30 పరుగులు ఇచ్చిన అతను కీలకమైన లెవిస్ వికెట్ తీశాడు. హర్షల్ పటేల్-3, డేనియల్ క్రిస్టియన్-1, యజువేంద్ర చాహల్-2, షాబాజ్ అహ్మద్-2 వికెట్లను పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను చాహల్ అందుకున్నాడు.
మ్యాక్స్వెల్..ఫుల్ స్వింగ్
ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ మరోసారి ఫుల్ స్వింగ్లో కనిపించాడు. 30 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో ఓ సిక్స్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు విరాట్ కోహ్లీ-25, దేవ్దత్ పడిక్కల్-22 పరుగులతో త్వరగా అవుట్ అయినా.. వన్డౌన్ బ్యాట్స్మెన్ కోన శ్రీకర్ భరత్, మ్యాక్స్వెల్ నిలకడగా ఆడారు. శ్రీకర్ భరత్ 35 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో 44 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 127 పరుగుల వద్ద అతను అవుట్ అయినప్పటికీ.. పెద్దగా ఫరక్ పడలేదు. క్రిస్ మోరిస్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్స్వెల్ 22 పరుగులు రాబట్టడంతో గెలుపు వాకిట్లో నిలిచింది. ఆ తరువాతి ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న ఏబీ డివిలియర్స్ దాన్ని బౌండరీకి పంపించాడు.
విరాట్ కోహ్లీలో గెలుపోత్సాహం..
ఈ మ్యాచ్లో విజయంతో రాయల్ ఛాలెంజర్స్ పాయింట్ల సంఖ్య 14కు పెరిగింది. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో ఏడింట్లో విజయాన్ని సాధించింది. ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపు ఖాయం చేసుకుంది. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచులను ఆడాల్సి ఉంది కోహ్లీసేన. తన తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢీ కొడుతుంది. ఆ తరువాతి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చివరిలో ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొంటుంది. ఢిల్లీ కేపిటల్స్ తప్ప మిగిలిన రెండు పెద్దగా ప్రతిఘటించేలా కనిపించట్లేదు.
కుర్రాళ్లకు క్రికెట్ పాఠాలు..
ఈ మ్యాచ్లో జట్టు గెలుపొందిన తీరు.. విరాట్ కోహ్లీని ఆనందంలో ముంచెత్తింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఉత్సాహంగా కనిపించాడతను. ఫుల్ జోష్లో కనిపించాడు కోహ్లీ. రాజస్థాన్ రాయల్స్కు చెందిన యంగ్ బ్యాటర్స్తో చాలాసేపు మాట్లాడాడు. తాను సంతకం చేసిన బ్యాట్ను రియాన్ పరాగ్కు అందించాడు. ఆ జట్టు యంగ్ క్రికెటర్లు కార్తిక్ త్యాగి, రావత్కు కొన్ని చిట్కాలను నేర్పించడం కనిపించింది. ఈ సారి కప్ కొట్టి- కేప్టెన్గా చివరి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పంపాలనే తపన రాయల్ ఛాలెంజర్స్లో నెలకొంది.


Click it and Unblock the Notifications












