KKR vs RCB: ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మకే సాధ్యం కాలేదు.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్ ఆడిన తొలి బ్యాట్స్మన్గా కోహ్లీ నిలిచాడు. సోమవారం అబుదాబి వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా ఆర్సీబీ కెప్టెన్ ఈ ఘనత అందుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్లు ఆడలేదు. అయితే ఓవరాల్గా చూసుకుంటే.. ఆర్సీబీ తరఫున కోహ్లీకి ఇది 215 మ్యాచ్. ఛాంపియన్స్ లీగ్ టీ20లో బెంగళూరు తరఫున 15 మ్యాచ్లు ఆడాడు.

ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్లు:
ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఈ స్టార్ ఆటగాడు ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ఈ క్రమంలోనే మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్ కోహ్లీకి 200వ మ్యాచ్. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్లు ఆడలేదు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. మహీ చెన్నై తరఫున 182 మ్యాచులు ఆడాడు. తర్వాతి స్థానాల్లో సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్-172), కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్-172), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్-162)లు ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన రోహిత్, ధోనీలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

4 సెంచరీలు:
మెగా టోర్నీలో అత్యధిక పరుగులు (6076) చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 5 శతకాలు, 40 అర్ధ శతకాలు ఉన్నాయి. ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు కూడా చేశాడు. 2016లో విరాట్ 4 సెంచరీలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకుంటానని కోహ్లీ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశాడు. ఆటగాడిగా విజయవంతమైన కోహ్లీ.. కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడు. ఆర్సీబీని ఇంతవరకు ఛాంపియన్గా నిలపలేకపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరడమే ఆర్సీబీ అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి అయినా ఆర్సీబీని విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.

బలంగా ఆర్సీబీ:
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ 2021 తొలి దశలో ఆర్సీబీ దుమ్మురేపింది. వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి టైటిల్ ఆశలు రేకెత్తించింది. మునపటి ఫామ్ను కొనసాగిస్తే.. యూఏఈలో కూడా ఆర్సీబీకి తిరుగుండదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ జట్టుకు అందుబాటులో ఉండటంతో బ్యాటింగ్ బలంగా ఉంది. పైగా తమ జట్టు మంచి స్థానంలో ఉండటంతో వీరంతా స్వేచ్చగా ఆడనున్నారు. అయితే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలు కోల్పోవడం ఆర్సీబీకి కాస్త మైనస్. వానిందు హసరంగా బెంగళూరు జట్టులో చేరడం మేలుచేసేదే. బౌలింగ్లోనూ ఆర్సీబీ బాగానే ఉంది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు తోడుగా హర్షల్ పటేల్, నవదీప్ సైనీ, కైల్ జెమీసన్తో లైనప్ బలంగా ఉంది.

6 ఓవర్లలో 41 పరుగులు:
అబుదాబి వేదికగా కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తరఫున ఇద్దరు ప్లేయర్స్ ఆరంగేట్రం చేశారు. కెఎస్ భరత్, వానిందు హసరంగా బెంగళూరు తరఫున తమ మొదటి మ్యాచ్ ఆడుతున్నారు. మరోవైపు కేకేఆర్ తరఫున వెంకటేశ్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. సచిన్ బేబీ కూడా కోల్కతా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. కోహ్లీ 2, పడిక్కల్ 22 పరుగులు చేసి ఔట్ అయ్యారు. భరత్, మ్యాక్స్వెల్ క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
KKR vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ఇద్దరు ప్లేయర్స్ ఆరంగేట్రం!కేకేఆర్లోకి అయ్యర్ ఎంట్రీ!