
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో మెగా లీగ్ ఆరంభం కానుంది. చెన్నై వేదికగా ఈ నెల 9న జరుగనున్న లీగ్ ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది. 11న మన తెలుగు జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు.
సాధనలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ రెండుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఒక జట్టుకు మనీష్ పాండే సారథ్యం వహించగా.. మరో టీమ్కు జానీ బెయిర్స్టో కెప్టెన్గా ఉన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన మనీష్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (50 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ భారీ సెంచరీతో రెచ్చిపోగా.. వృద్ధిమాన్ సాహా (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లు సిద్దార్థ్ కౌల్ 2 వికెట్లు పడగొట్టాడు.
170 పరుగుల లక్ష్య ఛేదనలో బెయిర్స్టో సేన 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మనీష్ సేన తొలి ప్రాక్టీస్ మ్యాచులో 31 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొహ్మద్ నబీ (33 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్స్టో (34 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రమే రాణించారు. బెయిర్స్టో సేనను ముజీబ్ ఉర్ రెహమాన్, బాసిల్ తంపి వణికించారు. ముజీబ్ తన కోట 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తంపి మూడు ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఐపీఎల్లో అత్యంత నిలకడ రాణిస్తున్న జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ఒకటి. 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ జట్టు ఆరంభంలో తడబడినా.. 2015లో డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదరగొడుతోంది. 2016 నుంచి 2020 వరకు వరుసగా అయిదేళ్లు ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. వార్నర్ నాయకత్వం.. టామ్ మూడీ వ్యూహరచన.. వీవీఎస్ లక్ష్మణ్ మార్గనిర్దేశనం హైదరాబాద్కు కొండంత బలం. ఇక టైటిల్ ఫేవరేట్స్లో సన్రైజర్స్ కూడా ఒకటి. మరి ఈ సీజన్లో ఎలా ఆడుతుందో చూడాలి.