
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. మహమ్మారి ప్రభావం క్రీడా రంగంపై బాగానే పడింది. వైరస్ కారణంగా ఎన్నో టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని మాత్రం నిరవధిక వాయిదా పడ్డాయి. భారత దేశంలో మహమ్మారి వ్యాప్తి కారణంగా గతేడాది ఏప్రిల్ మాసంలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అక్టోబర్ నెలలో యూఏఈలో జరిగింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోయింది. పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో మే 4న లీగ్ నిరవధిక వాయిదా పడింది. ఇక ఈ నెల అక్టోబర్ 19న మళ్లీ రెండో దశ ఆరంభం అయింది. ఓ కేసు నమోదయినా లీగ్ కొనసాగించారు బీసీసీఐ పెద్దలు. ఈ రోజు 44వ మ్యాచ్ జరగనుంది.
అయితే కరోనా వైరస్, విదేశాల్లో టోర్నీ జరుగుతుండటం వంటి కారణాల వల్ల ఐపీఎల్ 2021 రెండో దశకు అంతగా ఆదరణ లభిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కనీసం మొదటి దశలో వచ్చినంత వ్యూయర్షిప్ వస్తుందో లేదో అని కాస్త కంగారు పడ్డారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఈ సీజన్ ప్రేక్షకాదరణ పరంగా దుమ్మురేపుతోంది. ఇటీవల సినిమా హాళ్లు తెరుచుకున్నా.. ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా అవేమీ ఐపీఎల్ 2021కు అడ్డుగా మారలేదు. 35వ మ్యాచ్ ముగిసేసరికి ఐపీఎల్ 2021ను టీవీల్లో 380 మిలియన్ల (38 కోట్లు) మంది వీక్షించారట. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
'ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఐపీఎల్ ఎప్పటికపుడు వ్యూయర్షిప్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉంది. ఐపీఎల్ 2021లోని 35వ మ్యాచ్ ముగిసేసరికి ఈ లీగ్ను టీవీల్లో 380 మిలియన్ల (38 కోట్లు) మంది వీక్షించారు. ఐపీఎల్ 2020లోని 35 మ్యాచ్ల వరకు చూసుకుంటే.. ఐపీఎల్ 2021ను 12 మిలియన్ల (1.2 కోట్లు) మంది ప్రేక్షకులు అధికంగా చూశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పటినుంచి ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ప్లే ఆఫ్స్ అందరూ ఎంజాయ్ చేయండి' అని బీసీసీఐ సెక్రటరీ జై షా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఐపీఎల్ 2021 రెండో దశ రసవత్తరంగా జరుగుతోంది. లీగ్ దశ చివరి అంకానికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం అన్ని జట్టు ప్రయత్నిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్-4లో నిలవడం ఖాయం. ఈ రెండు జట్లకు ఇప్పటికే 16 పాయింట్లు ఉన్నాయి. మరొక మ్యాచ్ గెలిస్తే చెన్నై, ఢిల్లీకి అధికారిక బెర్త్ దక్కనుంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి అన్ని జట్లు రేసులోనే ఉన్నాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్కు చేరువలోనే ఉంది. మిగిలిన ఒక బెర్త్ కోసం మిగిలిన జట్లు పోటీపడుతున్నాయి. దీంతో మ్యాచులు రసవత్తరంగా సాగనున్నాయి. దాంతో ఐపీఎల్ వ్యూయర్షిప్ రెట్టింపయ్యే అవకాశం ఉంది.