
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ తిరిగి ప్రారంభమయ్యే తేదీని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. యూఏఈలో సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 15న దసరా పండగ ఉంది. దీంతో ఫైనల్ రోజు అభిమానులకు డబుల్ ధమాకా ఉండనుంది. ఒకవైపు దసరా, మరోవైపు మ్యాచ్తో ఫాన్స్ పండగ చేసుకోనున్నారు. ఇప్పటికే బీసీసీఐ అధికారులు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో సమావేశమయ్యారు.
బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మధ్య ఇటీవల జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని.. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాల్లో మిగిలిన ఐపీఎల్ 2021 మ్యాచులను సక్సెస్ చేస్తామని ఓ బీసీసీఐ అధికారి ఏఎన్ఐకి తెలిపారు. యూఏఈలో మ్యాచులను విజయవంతంగా నిర్వహిస్తామన్న విశ్వాసం బీసీసీఐలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను విజయవంతం చేస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కూడా హామీ ఇచ్చిందని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు. మిగిలిన మ్యాచులను పూర్తిచేయడానికి 25 రోజుల విండో చాలన్నారు. విదేశీ ఆటగాళ్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని, బోర్డు సానుకూల ఫలితాలను ఆశిస్తుందని ఆ అధికారి తెలిపారు.
ఇప్పటికే 29 మ్యాచ్లు పూర్తయిన ఐపీఎల్ 2021లో మరో 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది. దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బీసీసీఐ ముందునుంచి చెబుతూ వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్లో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. చాలా వరకూ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా రాకపోతే అప్పుడు చూస్తామని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు.
తాజాగా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021లోని మిగిలిన 31 మ్యాచ్లు 27 రోజుల్లో జరగనున్నాయి. వాయిదా పడిన షెడ్యూలు ప్రకారం ఇక మిగిలింది 6 డబుల్ హెడర్స్ మాత్రమే. 27 రోజుల విండో ఉండటంతో వాటి సంఖ్యను 7 నుంచి 9 వరకు పెంచే అవకాశం ఉంది. అంటే కనీసం 7 లేదా 9 రోజులు రెండు మ్యాచులు జరగనున్నాయి. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలో ఐపీఎల్ 14 సీజన్ మ్యాచులు జరుగుతాయి. తుది దశ, నాకౌట్ మ్యాచులన్నీ ఒకే వేదికలో నిర్వహిస్తారని సమాచారం. బహుశా దుబాయ్ ఇందుకు వేదిక కావొచ్చు.