
భారత్కు రావాలంటే:
దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని ఎంచుకుందన్న వార్తలు చాలా రోజుల కిందటే వచ్చాయి. ఇప్పుడు ఐపీఎల్ 2021 వాయిదా పడటంతో మెగా టోర్నీని యూఏఈకి తరలించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. అసలే అంతర్జాతీయ టోర్నీ. ఏమాత్రం తేడా వచ్చినా.. బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వ పరువు కూడా పోతుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా జట్లు కూడా భారత్కు రావాలంటే జంకుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా చెప్పింది.

మూడో వేవ్ ఉంటుందని అంచనా:
మెగా టోర్నీని యూఏఈకి తరలించేందుకు ఇప్పటికే బోర్డు పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించారని వినికిడి. ప్రభుత్వం సైతం ఇందుకు అంగీకరించిందనే సమాచారం. 'నాలుగు వారాల్లోనే ఐపీఎల్ 2021ను వాయిదా వేయడం అంతర్జాతీయ మెగా టోర్నీ నిర్వహణకు సురక్షితం కాదన్న సంకేతాలు పంపించింది. దేశం గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య విపత్తును చవిచూస్తోంది. నవంబర్ మాసంలో భారత్లో మూడో వేవ్ ఉంటుందని అంచనా. ఆతిథ్యం బీసీసీఐదే అయినప్పటికీ టీ20 ప్రపంచకప్ టోర్నీని యూఏఈకి తరలించాలన్నది ఆలోచన' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

బ్యాకప్ వేదికగా యూఏఈ:
భారత దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు వస్తుండటంతో ఐసీసీ సహా సభ్య దేశాలు అంతర్జాతీయ జట్ల క్షేమాన్ని రిస్క్లో పెట్టకూడదని భావిస్తున్నాయి. 'మనమెంత హామీ ఇచ్చినా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భారత్కు ఎవరూ రారు. సాధారణ పరిస్థితులు ఉన్నా.. కనీసం ఆరు నెలల వరకు భారత్కు వచ్చేందుకు అత్యున్నత క్రికెట్ దేశాలు అంగీకరించవు. ఇక్కడికి ప్రయాణించేందుకు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు సైతం ఆందోళన చెందుతారు. అందుకే యూఏఈకి తరలించేందుకు బీసీసీఐ అభ్యంతరం తెెలపదని అంచనా' అని బోర్డు మరో అధికారి అన్నారు.

ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం:
ఐపీఎల్ 2021 వాయిదా పడటంతో బీసీసీఐ పెద్దలు ఇకపై సాహసాలు చేసేందుకు వెనుకాడే పరిస్థితి నెలకొందని ఆ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. 'భారత్ సురక్షితమేనని ఐపీఎల్ ద్వారా ప్రపంచకప్ దేశాలకు నిరూపించాలని బోర్డు భావించింది. నాలుగు వారాలు బాగానే గడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయింది. అక్టోబర్-నవంబర్లోనూ ఇలా జరగదని గ్యారంటీ ఏంటి?. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి' అని అన్నారు. యూఏఈలో నిర్వహించేందుకు ప్రధాన కారణాలు అక్కడ విమాన ప్రయాణాలు అవసరం లేకపోవడం, వేదికలు సైతం మూడేనని మరొకరు తెలిపారు. ఏదేమైనా జూన్లో జరిగే ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని ఆ అధికారి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications
