ముంబై: ఆటగాళ్లకు కరోనా మహమ్మారి సోకుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార పరిధిలో చేయాల్సిందంతా చేస్తామని బోర్డు అధికారులు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులువుగా కనిపించడం లేదు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్ల విషయంలో.
IPL 2021: మేం కప్పు కొట్టడం.. ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టు ఉంది! అందుకే ఇలా?!
ఇప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఈ నెల 15 వరకూ నిషేధం విధించింది. ఐపీఎల్ 2021 లీగ్లో మొత్తం 14 మంది ప్లేయర్స్తో పాటు రికీ పాంటింగ్, డేవిడ్ హస్సీ, మైకేల్ హస్సీ, మాథ్యూ హేడెన్, లిసా స్టాలేకర్ లాంటి ఆస్ట్రేలియా దేశస్తులు చాలా మందే ఉన్నారు. వీళ్లను ఆస్ట్రేలియా పంపించడం బీసీసీఐకి అంత సులువైన పని కాదు. టోర్నీ మొత్తం ముగిసిన తర్వాత అయితే అప్పటికి నిషేధం ఎత్తేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాగోలా వెళ్లొచ్చులే అని ప్లేయర్స్ భావించారు. కానీ ఉన్నట్టుండి మధ్యలోనే వాయిదా పడటంతో ఆసీస్ ప్లేయర్స్కు ఎటూ పాలుపోని స్థితి ఏర్పడింది.
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సహా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఐపీఎల్ 2021లో పాల్గొన్న తమ దేశ ఆటగాళ్ల విషయంలో ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. సొంత ఖర్చులతోనే ఆసీస్ రావాలని స్పష్టం చేసింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లకు బీసీసీఐ, భారత ప్రభుత్వమే దిక్కు. ఇక్కడ బీసీసీఐ పెద్దలు, భారత పెద్దలు చొరవ తీసుకుంటే గానీ వారు ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి లేదు. ఉన్నపళంగా ఐపీఎల్ను రద్దు చేసిన బీసీసీఐ.. విదేశీ క్రికెటర్లను సురక్షితంగా వారి వారి దేశాలకు పంపే పనిలో పడింది.
నిన్న కేకేఆర్, సీఎస్కే క్యాంపులో వెలుగుచూసిన కరోనా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ శిబిరాన్ని కూడా ఆందోళనకు గురి చేసింది. వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 9 మందికి కరోనా సోకడంతో ఐపీఎల్ను రద్దు చేయకతప్పలేదు.