
ముంబై: వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసి.. ఢిల్లీకి 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 'మిస్టర్ ఐపీఎల్' సురేశ్ రైనా (54; 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా.. ఈఏడాది సీజన్ తొలి మ్యాచ్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. ఆల్రౌండర్లు మొయిన్ అలీ (36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్ కరన్ (34;15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే సీనియర్ స్పిన్నర్ అశ్విన్ నాలుగు ఓవర్లు వేసి వికెట్ పడగొట్టి 47 పరుగులు సమర్పించుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. పేసర్ ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (0) ఔట్ కాగా.. క్రిస్ వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి 6 ఓవర్లకు చెన్నై 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ఈ దశలో మొయిన్ అలీ, సురేష్ రైనా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అలీ సిక్సులతో అదరగొట్టాడు. దీంతో 8 ఓవర్లకు 48/2తో కష్టాల్లో ఉన్న జట్టు మెరుగైనస్థితికి చేరింది. ఆపై అలీ ఔట్ అయ్యాడు.
ఈ సమయంలో అంబటి రాయుడు (23)తో కలిసి సురేష్ రైనా రెచ్చిపోయాడు. ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. గతేడాది టోర్నీకి దూరమైన రైనా.. ఈఏడాది సీజన్ తొలి మ్యాచ్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. మార్కస్ స్టోయినీస్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతిని భారీ సిక్సర్ బాది.. 32 బంతుల్లోనే ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజాతో సమన్వయ లోపం కారణంగా రైనా నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజలోకి వచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న రెండో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. దీంతో మహీ డకౌట్గానే పెవిలియన్ చేరాడు.
ఆఖర్లో టామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో శామ్ కరన్ చితక్కొట్టాడు. ఆ ఓవర్లో జడ్డూ ఒక ఫోర్ బాదగా.. శామ్ వరుసగా 6, 6 ,4 కొట్టడంతో 23 రన్స్ వచ్చాయి. జడ్డూ (26), శామ్ జోడీ 50కి పైగా పరుగులు రాబట్టడంతో చెన్నై 180 మార్క్ దాటింది. చివరి ఓవర్లో వోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై 200పరుగుల మార్క్ చేరుకోలేకపోయింది.