కచ్చితంగా నిరాశ కలిగించేదే:
తాజాగా స్టార్ స్పోర్ట్స్లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... ఆటలో ప్రతి ఒక్కరూ ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకుంటారని, అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవన్నాడు. 'ఆర్సీబీ ఇలా టోర్నీ నుంచి నిష్క్రమించడం కచ్చితంగా నిరాశ కలిగించేదే. ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా ముగింపు ఇవ్వాలని అనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా వ్యక్తిగతంగా అలాగే భావించి ఉంటాడు. కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడూ మనం అనుకున్నట్లు లేదా అభిమానులు ఆశిస్తున్నట్లు ఎప్పుడూ జరగవు. సర్ బ్రాడ్మన్ లాంటి దిగ్గజం విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అతడి కెరీర్లో 100 సగటు సాధించడానికి చివరి మ్యాచ్లో నాలుగు పరుగులే అవసరమయ్యాయి. కానీ అందులోనే బ్రాడ్మన్ డకౌటయ్యాడు' అని సన్నీ తెలిపాడు.
ఏదైనా రాసిపెట్టి ఉండాలి:
'క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విషయంలో ఇదే జరిగింది. తన 200వ టెస్టులో శతకంతో ముగించాలని సచిన్ అనుకొని ఉంటాడు. కానీ 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఎప్పుడూ మనం ఊహించినట్లు రాసిపెట్టి ఉండదు. ఏదైనా రాసిపెట్టి ఉండాలి. అందరూ ఘనంగా ముగింపు ఇవ్వాలంటే కుదరదు. విరాట్ కోహ్లీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. కోహ్లీ ఇక సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్న నేపథ్యంలో ఈసారి కప్ కొట్టాలని ఫాన్స్ ఆశించారు. బెంగళూరు ప్లేయర్స్ కూడా అలానే ఆలోచించి ఉంటారు. కానీ అలా జరగలేదు' అని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 కోసం ప్రస్తుతం సన్నీ యూఏఈలోనే ఉన్న విషయం తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ కోసం అతడు కామెంటరీ బాక్సులో ఉన్నాడు.
కోహ్లీ అంకితభావానికి నిదర్శనం అది:
విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఆయువుపట్టులా మారాడు. ఆర్సీబీ జట్టుకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. శక్తివంచన లేకుండా జట్టు కోసం విరాట్ పాటుపడ్డాడు. 2016 సీజన్లో 973 పరుగులు సాధించాడు. అది చాలా అరుదైన విషయం. అంతేకాదు బెంగళూరుకు ఒక బ్రాండ్ తీసుకొచ్చాడు. ఇలాంటి గొప్ప ఆటగాడు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడం బాధాకరమే. ఇకపై ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకొన్నా.. ఆటగాడిగా అదే జట్టు తరఫున కొనసాగడం కోహ్లీ అంకితభావానికి నిదర్శనం. అతడు ఇకపై బ్యాటర్గా మరింత చెలరేగుతాడు' అని సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
క్యాప్తో కవర్ చేశాడు:
మొత్తానికి విరాట్ కోహ్లీ సారథిగా చివరి ప్రయత్నంలోనూ ఐపీఎల్ కప్పు వేటలో విజయవంతం కాలేదు. ఇది అభిమానులకు ఎప్పటికీ రుచించని విషమయే. ఐపీఎల్ టోర్నీ విరాట్ కెరీర్లో ఎప్పటికీ ఒక లోటే. గత సీజన్లలో ఆర్సీబీ లీగ్ దశల్లోనే నిష్క్రమించినపుడు కూడా ఉద్వేగానికి గురి కాకుండా తర్వాతి సీజన్ ఉందికదా అనుకుని మామూలుగా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఉద్వేగానికి గురయ్యాడు. కోహ్లీ కళ్లలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. మైదానంలోనే ఏడ్చేశాడు. తన కళ్లలోకి వచ్చిన నీళ్లను తుడుచుకుంటూ కనిపించిన కోహ్లీ.. తన బాధను క్యాప్తో కవర్ చేశాడు. అది చూసిన ఫాన్స్ మరింత నిరాశకు గురయ్యారు. ఏబీ డివిలియర్స్, మొహ్మద్ సిరాజ్ కూడా మైదానంలోనే కంటతడి పెట్టారు. ఇందుకు సంబందించిన వీడియో, పోటీలు నెట్టింట వైరల్ అయ్యాయి.