
చెన్నై: చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడే స్కోర్ చేసింది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసి.. సన్రైజర్స్ ముందు 160 పరుగుల లక్ష్యంను ఉంచింది. ఓపెనర్ పృథ్వీ షా (53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) అర్ధ శతకం చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (37: 27 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్), స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (34: 25 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) పర్వాలేదనిపించారు. శిఖర్ ధావన్ (28) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. సన్రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ (2/31) ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. జగదీశ సుచిత్ నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులే ఇచ్చాడు. విజయ్ శంకర్ (0/19) సైతం ఢిల్లీ బ్యాట్స్మెన్ను కట్టడి చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ (28; 26 బంతుల్లోనే 3 ఫోర్లు) దంచికొట్టారు. ముఖ్యంగా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలతో చెలరేగుతూ సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. ఈ క్రమంలోనే షా 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు.
ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న షా, గబ్బర్ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. 11వ ఓవర్లో ధావన్ను బౌల్డ్ చేసి సన్రైజర్స్కు భారీ ఊరటనిచ్చాడు. తర్వాతి ఓవర్లోనే దూకుడుమీదున్న పృథ్వీ రనౌటయ్యాడు. దాంతో ఢిల్లీ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆపై పంత్, స్మిత్ రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సిద్ధ్ర్థ్ కౌల్ వేసిన 19వ ఓవర్లో పంత్, హెట్మేయర్ (2) పెవిలియన్ చేరారు. ఆఖరి ఓవర్లో స్మిత్ ధాటిగా ఆడి 14 పరుగులు రాబట్టాడు. సన్రైజర్స్ బౌలర్లలో సిద్దార్థ్ రెండు, రషీద్ ఒక వికెట్ పడగొట్టారు.