చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో మూడు పరాజయాల తర్వాత ఎట్టకేలకి బోణి కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టబోతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచుకు వేదిక. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. లలిత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చినట్టు పంత్ తెలిపాడు. మరోవైపు సన్రైజర్స్ కూడా ఒక మార్పు చేసింది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో జగదీశ సుచిత్ మ్యాచ్ ఆడనున్నాడు.
CSK vs RCB: సురేష్ రైనా అరుదైన రికార్డు.. రోహిత్, ధోనీ సరసన మిస్టర్ ఐపీఎల్!!
ఐపీఎల్ 2021 సీజన్లో నాలుగు మ్యాచ్లాడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. పంజాబ్ జట్టుపై గెలిచి మంచి విశ్వాసంతో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో భారీ స్కోర్ నమోదయ్యే ఆవేశం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు చేసినా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలుపొందగా.. మిగిలిన 7 మ్యాచ్ల్లో ఢిల్లీ విజయం సాధించింది. ఐపీఎల్ 2020 సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఈ రెండు జట్లు తలపడగా.. రెండింటిలో హైదరాబాద్ విజయం సాధించింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
తుది జట్లు:
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్ (కెప్టెన్/కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మైర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబడా, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (కీపర్), కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, జగదీశ సుచిత్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్.