
చెన్నై: చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని సన్రైజర్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లకు 143/9కే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేసినా.. మిడిలార్డర్ బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్ చేరడంతో సన్రైజర్స్కు పరాజయం తప్పలేదు. కీలక సమయంలో మనీశ్ పాండే ఔట్ అవ్వడంతో సన్రైజర్స్ టీమ్ సీఈవో కావ్య మారన్ నిరాశ వ్యక్తం చేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 35 పరుగులు అవసరం. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. దాంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ ఒకే ఒక ఓవర్లో మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతుల్లోకి వెళ్లిపోయింది. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన షహబాజ్ అహ్మద్ సాఫీగా సాగుతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్లో అలజడి రేపాడు. తొలి రెండు బంతులకు అనవసరపు షాట్లకు ప్రయత్నించిన జానీ బెయిర్స్టో (12), మనీశ్ పాండేల (38)ను అవుట్ చేయడంతో పాటు.. చివరి బంతికి సమద్ (0)ను డకౌట్ చేశాడు.
కీలక ప్లేయర్ బెయిర్స్టో పెవిలియన్ చేరిన తర్వాతి బంతికే.. గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్న మనీశ్ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔట్ అవ్వడంతో సన్రైజర్స్ టీమ్ సీఈవో కావ్య మారన్ నిరాశ వ్యక్తం చేశారు. అలా నిర్లక్షపు షాట్ ఆడుతావ్ అంటూ.. చేయి సంజ్ఞలతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కావ్య ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫాన్స్ కూడా ఆమెకు ముద్దుగా నిలుస్తూ.. 'పాపం కావ్య' అని పోస్టులు పెడుతున్నారు.
29 ఏళ్ల కావ్య మారన్ మరెవరో కాదు.. తమిళనాడు మీడియా కింగ్ కళానిధి మారన్ ఏకైక కూతురు. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం ఛానల్స్కు సీఈవో. సన్ నెట్వర్క్ చానెల్స్ బిజినెస్లోనూ ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. సన్రైజర్స్ మ్యాచులలో కావ్య మారన్.. తన అందచందాలతో అందరి కళ్లను తనవైపుకు తిప్పుకున్నారు. సన్రైజర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు.. బౌండరీలు, సిక్సులు బాదినప్పుడు ఆమె సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మనీశ్ వికెట్ కోల్పయినప్పుడు మాత్రం నిరాశ చెందారు. కావ్య మారన్ తొలిసారి 2018 సీజన్ ఐపీఎల్లో కనిపించారు.