
ముంబై: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ అవుతానని గతేడాది చివరి వరకు తాను అస్సలు ఊహించలేదని చెపుతున్నాడు టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నాయని, దానిని ఆచరణలో పెట్టడం కష్టమే అయినా ప్రయత్నిస్తానని తెలిపాడు. గతేడాది సీజన్లో రాయల్స్ 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 8 ఓటములతో చెత్త ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కెప్టెన్గా విఫలమైన స్టీవ్ స్మిత్ను జట్టు నుంచి రిలీజ్ చేసిన రాయల్స్.. శాంసన్కు పగ్గాలు అప్పజెప్పింది.
తాజాగా సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'కెప్టెన్గా రాజస్తాన్ రాయల్స్ను నడిపించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలనే దానిపై మనుసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడం కాస్త కష్టమే అయినా ప్రయత్నిస్తా. ఈ బాధ్యతలతో మాత్రం సంతోషంగా ఉన్నా. నిజం చెప్పాలంటే నేను రాయల్స్కు కెప్టెన్ అవుతానని గతేడాది చివరి వరకు అస్సలు ఊహించలేదు. మా జట్టు మేనేజర్ మనోజ్ బాద్లే నా దగ్గరకు వచ్చి.. నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు కెప్టెన్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉండు చెప్పాడు' అని తెలిపాడు.
'రాజస్తాన్ రాయల్స్ కొత్త డైరెక్టర్, కోచ్గా బాధ్యతలు చేపట్టిన కుమార సంగక్కరతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. అంతర్జాతీయ వికెట్ కీపర్గా శ్రీలంకకు సేవలు అందించిన సంగక్కర లాంటి లెజెండ్తో కలిసి పనిచేయడం నా అదృష్టం. కెప్టెన్సీ లక్షణాలతో పాటు వికెట్ కీపింగ్లో మరిన్ని మెళుకువలు నేర్చుకునే నాకు అవకాశం దొరికింది' అని శాంసన్ పేర్కొన్నాడు. ఎవరూ కూడా ఎంఎస్ ధోనీ కాలేరని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నానని, సంజు శాంసన్లా ఉంటే చాలన్నాడు.
ఐపీఎల్ మొదటి సీజన్లో విజేతగా నిలిచిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన నమోదు చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 13 సీజన్లలో రాయల్స్కు కెప్టెన్లు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారలేదు. ఇక కష్టకాలంలో రాయల్స్ కెప్టెన్గా ఎంపికైన సంజు శాంసన్ ముందు సవాళ్లు చాలానే ఉన్నాయి. జట్టును సమన్వయంతో నడిపిస్తూనే.. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడనుండడం.. టైటిల్ సాధించాలనే కల అతనికి సవాల్గా మారనుంది.