
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతూ టీమిండియా ఎంపిక కోసం ఆలోచించడం తప్పని రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ అంటున్నాడు. టీమిండియా ఎంపిక గురించి ఆందోళన చెందకుండా ఐపీఎల్ 2021 రెండో దశపై దృష్టి పెడతానన్నాడు. ప్రతి ఒక్కరికీ ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ఎంపిక చేసిన భారత జట్టులో కేరళ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సంజూకు చోటు దక్కలేదు. మెగా టోర్నీకి వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు.
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సంజు శాంసన్ రాణించడంతో అంతర్జాతీయ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తాడని అందరూ భావించారు. కానీ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన సంజు.. లంక పర్యటన ముందు వరకు ఆడింది కేవలం 7 టీ20లు మాత్రమే. దీంతో సంజుకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వట్లేదని బీసీసీఐపై ఓ అపవాదు ఉంది. అందుకే గతేడాది నుంచి పలు అవకాశాలు ఇచ్చినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాడు. లంక పర్యటనలో మూడో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. మూడు టీ20లలో కలిపి 34 పరుగులే చేసి నిరాశపరిచాడు. కీలక సమయంలో వికెట్ పారేసుకుని విమర్శల పాలయ్యాడు. దాంతో ప్రపంచకప్ 2021 ఎంపిక కోసం బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకొలేదు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రస్తుతం ఐపీఎల్ 2021 కోసం సిద్దమవుతున్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'స్పష్టమైన మనస్సుతో జట్టులోకి వెళ్లడం ముఖ్యం. మీరు ఒక ఐపీఎల్ టీమ్లో ఆడేటప్పుడు టీమిండియా సెలెక్షన్ గురించి ఆలోచించడం తప్పు. భారత్ సెలెక్షన్ గురించి, జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలని బయట చాలామంది మాట్లాడుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్ ప్రదర్శన కేవలం జట్టు ఎంపికకు ఒక ప్రామాణికం మాత్రమే. ఎవరైనా బాగా ఆడితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి' అని సంజూ అన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్కు ఎంతో ఆదరణ ఉందని.. దీంతో మంచి గుర్తింపు వస్తుందని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే చాలా మంది చాలా విషయాలు మాట్లాడుకుంటారన్నాడు. ప్రతి ఒక్కరికీ ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని.. తనలాంటి వాళ్లు చాలా మంది తుది జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని సంజూ గుర్తుచేశాడు. భారత క్రికెట్ సక్సెస్కు ఇదే నిదర్శనమని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 కోసం ఎదురుచూస్తున్నాని సంజు చెప్పుకొచ్చాడు. రెండో దశలో పంజాబ్ కింగ్స్ జట్టుతో రాజస్థాన్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. 2015లో జట్టులోకి వచ్చిన సంజు.. భారత్ తరఫున ఇప్పటివరకు కేవలం ఒక వన్డే, 10 టీ20లు మాత్రమే ఆడాడు.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ పలు కారణాలతో ఐపీఎల్ 2021 రెండో దశకు దూరమయిన విషయం తెలిసిందే. మానసిక ఆరోగ్య సమస్యలతో స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ , వ్యక్తిగత కారణాలతో వికెట్ కీపర్ జోస్ బట్లర్.. గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2021 టోర్నమెంట్ నుంచి వైదొలగారు. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో రాయల్స్ బలహీనపడింది. అయితే బట్లర్ స్థానాన్ని ఎవిన్ లూయిస్, స్టోక్స్ ప్లేస్ను ఒషేనే థోమాస్తో రీప్లేస్ చేసింది. దాంతో రాయల్స్ జట్టు బలంగా మారింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్ట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.