IPL 2021: అలానేనా ఆడేది.. అత్యంత ఫ్రస్ట్రేషన్ సీజన్ ఇదే! సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ మంజ్రేకర్!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 శుక్రవారం ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ధోనీసేన 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగోసారి చెన్నై కప్ ముద్దాడింది. రెండు దశల వారీగా జరిగిన ఐపీఎల్ 202లో మొత్తంగా 60 మ్యాచ్లు జరిగాయి. లీగ్ దశలో 56 మ్యాచులు జరగ్గా.. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచులతో కలిపి 60 గేమ్స్ జరిగాయి. అయితే ఐపీఎల్ 2021పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్స్ బాగా ఆడలేదని, అత్యంత ఫ్రస్ట్రేషన్ సీజన్ ఇదే అని పేర్కొన్నాడు.

అంచనాలను అందుకోలేకపోయారు:
ఐపీఎల్ 2021లోని ప్రతి మ్యాచ్కు సంబంధించి సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ గురించి.. ఆటగాళ్ల ప్రదర్శనపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20లకు పనికి రాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంజ్రేకర్.. మరోసారి భారత అగ్రశ్రేణి క్రీడాకారులపై విరుచుకుపడ్డాడు. అత్యున్నత స్థాయి ఆటను ఐపీఎల్ 2021 సీజన్లో ప్రదర్శించలేకపోయారన్నాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ మనీశ్ పాండే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, సన్రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్, సన్రైజర్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోయారు.

అత్యంత నిరాశపరిచిన ఐపీఎల్:
క్వాలిఫయర్ 2 ముగిసిన వెంటనే ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ 2021ని నేను చాలా దగ్గరగా చూశాను. ఇది చాలా ప్రత్యేకమైన ఐపిఎల్. ఎందుకుంట లీగ్ దశ మ్యాచులు చాలా విచిత్రంగా ముగిశాయి. ప్రస్తుత ఎడిషన్లో సామర్థ్యం పరంగా స్థిరమైన ఆటగాళ్లు, సాధారణంగా కనిపించి అద్భుత ఆటను ప్రదర్శించిన వారి మధ్య చాలా తేడా ఉంది. అన్ని మ్యాచ్లను దగ్గర్నుంచి చూశా. ఎందరో నాణ్యమైన యువ ఆటగాళ్లను చూశాను. అలాగే పలు ఆసక్తికరమైన ముగింపు ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ ప్రస్తుత సీజన్ నాకు అత్యంత నిరాశపరిచిన ఐపీఎల్. ప్రారంభంలో పైచేయి సాధించిన జట్లు చివర్లో తేలిపోయాయి' అని అన్నాడు.

సరైన ఉదాహరణ అదే:
ఐపీఎల్ 2021 గురించి సంజయ్ మంజ్రేకర్ ఏం చెప్పాలనుకుంటున్నారో దానికి సరైన ఉదాహరణనే.. కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్. అప్పటి వరకూ గెలుపు దిశగా సాగుతున్న కేకేఆర్ ఒక్కసారిగా భారీ కుదుపులకు గురై ఓటమి అంచుకు చేరింది. చివరి మూడు ఓవర్లలో కేవలం 11 పరుగులు చేయాల్సిన సమయంలో.. ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అలాంటి మంచి తరుణంలో ఢిల్లీ బౌలర్ల ధాటికి కేకేఆర్ తేలిపోయింది. టాప్ బ్యాటర్లు ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తిక్, షకిబ్ ఉల్ హాసన్ , సునీల్ నరైన్ డకౌట్గా వెనుదిరిగారు. దీంతో ఢిల్లీ విజయం సాధించేలా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి చివరలో సిక్సర్తో ఫైనల్ బెర్తును కేకేఆర్కు అందించాడు. త్రిపాఠి సిక్స్ బాదకుంటే మాత్రం కేకేఆర్కు ఓటమిని చవిచూసేది.

నోటిదూల కారణంగా:
సంజయ్ మంజ్రేకర్కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉంది. అంతకుమించి ఇంగ్లీష్, హిందీ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. వివాదంలో చిక్కుకున్నాడు. గతంలోనూ ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ని 'మతిలేని క్రికెటర్' అంటూ సెటైర్ వేశాడు. 2019 వన్డే ప్రపంచకప్లో 'బిట్స్ అండ్ పీసెస్' అంటూ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. ఇక సహచర కామెంటేటర్ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. మంజ్రేకర్కు ఉన్న నోటిదూల కారణంగా అతనిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తనని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పిండంపై మంజ్రేకర్ క్షమాపణలు కోరాడు. ఇక ఐపీఎల్ 2020కి కామెంట్రీ ఫ్యానల్ని బీసీసీఐ ప్రకటించబోతున్న సమయంలో కూడా తనని తీసుకోవాలని అభ్యర్థిస్తూ బోర్డుకి ఓ లేఖ రాశాడు. అయినా కూడా బీసీసీఐ ఐపీఎల్ 2020 కోసం అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అప్పటినుంచి వేటు కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications