
ఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్రైజర్స్ కొత్త కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందరూ అనుకున్నట్టే డేవిడ్ వార్నర్పై వేటు పడింది. మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కేన్ మామ చెప్పాడు. వార్నర్, సుచిత్, కౌల్ స్థానాల్లో నబీ, భువీ, సమద్ జట్టులోకి వచ్చారు. మరోవైపు రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. దూబే, ఉనద్కత్ స్థానాల్లో త్యాగి, అనుజ్ ఆడుతున్నారు.
తాజా సీజన్లో ఓటములతో విసిగిపోయిన సన్రైజర్స్ సంస్కరణల బాట పట్టింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్పై వేటు వేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్కు పగ్గాలు అప్పజెప్పింది. కేన్ మామ సారథ్యంలో అయినా సన్రైజర్స్ విజయాల బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్ల్లో హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించగా.. అన్నే మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండు మ్యాచ్ల్లో గెలుపొందింది. వరుస పరాజయాలతో ఢీలా పడిపోయిన సన్రైజర్స్.. గత మ్యాచులో ఫామ్ అందుకున్న రాజస్థాన్పై గెలుపొందాలంటే శ్రమించాల్సిందే.
ఐపీఎల్లో హైదరాబాద్, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ 13 మ్యాచ్ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఏడు మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం సాధించగా.. ఆరు మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలుపొందింది. రాజస్థాన్పై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులు కాగా.. హైదరాబాద్పై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 198. గత రెండు సీజన్లలో నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా.. చెరో రెండు మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఢిల్లీ పిచ్ బ్యాట్స్మన్కు అనుకూలం. బౌండరీ సరిహద్దు కూడా చిన్నదే కావడంతో.. 200లకు పైగా స్కోర్ చేసినా విజయంపై నమ్మకం ఉండదు. చెన్నై-ముంబై మ్యాచే ఇందుకు మంచి ఉదాహరణ.
తుది జట్లు:
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
హైదరాబాద్: జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, మొహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ.