
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 14వ సీజన్ కోసం న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ ఫిన్ అలెన్ను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోష్ ఫిలిప్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అలెన్ను జట్టులోకి చేర్చుకుంది. ఈ మేరకు ఆర్సీబీ ఓ ట్వీట్ చేసింది. బీసీసీఐ ఇటీవలే ఐపీఎల్ 2021 షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమై మే 30న ముగుస్తుంది.
'వ్యక్తిగత కారణాల వల్ల జోష్ ఫిలిప్ ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఫిలిప్ స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఫిన్ అలెన్ను జట్టులోకి తీసుకున్నాం' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్వీట్ చేసింది. ఇటీవల ముగిసిన బిగ్బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడిన ఫిలిప్.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. అయితే గతేడాది ఐపీఎల్లో ఐదు మ్యాచ్ల్లో 78 రన్స్ మాత్రమే చేశాడు.
ఫిన్ అలెన్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ .20 లక్షలతో ఒప్పందం చేసుకుంది. జోష్ ఫిలిప్ కనీస ధరనే అలెన్కు ఆర్సీబీ చెల్లించనుంది. అలెన్ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. న్యూజిలాండ్ తరఫున 12 ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడాడు. 343 రన్స్ చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఇక 13 టీ20ల్లో 537 పరుగులు చేశాడు. గతేడాది ఫిలిప్ ఓపెనర్గా ఆడాడు. బెంగళూరు తమ మొదటి మ్యాచులోడిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబైని ఢీకొట్టనుంది.
మరోవైపు ఐపీఎల్ 2021 కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బుధవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ధోనీ బ్యాట్ పట్టాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి బరిలో దిగాడు. చేతిలో క్రికెట్ బ్యాట్లు పట్టుకొని, భుజంపై కిట్ బ్యాగ్ వేసుకొని మైదానంలోకి వస్తుండగా తీసిన ఫొటోను చెన్నై ఫ్రాంఛైజీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంబటి రాయుడు సహా మరికొందరు ప్లేయర్లు అక్కడ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.