
పడిక్కల్కు కరోనా
శనివారం జరిగిన వైరస్ పరీక్షల్లో దేవదత్ పడిక్కల్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో బెంగళూరు ప్రాంచైజీ అతడిని హోటల్లో ఐసొలేషన్లో ఉంచింది. ప్రత్యేక వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. అతడికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమచారం. పడిక్కల్కు పాజిటివ్గా తేలడంతో.. సీజన్ ఆరంభ మ్యాచుకు దూరం కానున్నాడు. శుక్రవారం తొలి మ్యాచులో ముంబైతో ఆర్సీబీ తలపడనుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 20 ఏళ్ల పడిక్కల్ కర్ణాటక తరఫున అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచ్ల్లో 147.40 సగటుతో 737 పరుగులు చేశాడు.

20 మందికి పైగా
మార్చి 28న ముంబైలో జట్టుతో కలిసి ఇటీవల హోటల్లోకి ప్రవేశించినపుడు నిర్వహించిన పరీక్షల్లో అక్షర్ పటేల్కు నెగెటివ్యే వచ్చింది. కానీ తాజా పరీక్షల్లో అక్షర్కు వైరస్ ఉన్నట్లు వెల్లడైంది. అతణ్ని ఐసోలేషన్లో ఉంచి వైద్య సహాయం అందిస్తున్నారు. మరోవైపు ముంబైలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాల్సిన వాంఖడె స్టేడియంలో పని చేస్తున్న సిబ్బందిలో ఏకంగా పది మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మ్యాచ్ల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించుకున్న ఈవెంట్ మేనేజర్లలోనూ ఆరేడుగురు కరోనా పాజిటివ్గా తేలారు. ఇలా మొత్తంగా లీగులో భాగమైన 20 మందికి పైగా కరోనా సోకింది.

ఈ సారైనా
ఆకర్షణకు ఏమాత్రం లోటు లేదు.. అభిమాన బలానికి అసలు తిరుగులేదు.. అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు!! అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్లో తొలి టైటిల్ మాత్రం దక్కట్లేదు. ఈ సారి కచ్చితంగా విజేతగా నిలుస్తుందని సీజన్ వచ్చినపుడల్లా ఎదురుచూసే అభిమానులకు నిరాశ తప్పట్లేదు. లీగ్ చరిత్రలో ఇప్పటివరకూ మూడు సార్లు (2009, 2011, 2016) ఫైనల్ చేరిన బెంగళూరు చివరి మెట్టుపై బోల్తాపడింది. యూఏఈలో జరిగిన గత సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఎలిమినేటర్లో ఓడి నాలుగో స్థానంతో ముగించింది. ఇప్పటికీ 13 సీజన్లు గడిచినా ఇంకా తొలి టైటిల్ను ఖాతాలో వేసుకోని బెంగళూరు.. ఈ సారైనా ఆ నిరీక్షణకు తెరదించుతుందేమో చూడాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
దేశీయ ఆటగాళ్లు: కోహ్లీ (కెప్టెన్), సిరాజ్, షాబాజ్ అహ్మద్, కేఎస్ భరత్, చహల్, సైనీ, దేవ్దత్ పడిక్కల్, ప్రభుదేశాయ్, సచిన్ బేబి, పవన్ దేశ్పాండే, సుందర్, హర్షల్ పటేల్, రజత్, మహమ్మద్ అజహరుద్దీన్.
విదేశీయులు: డివిలియర్స్, రిచర్డ్సన్, జంపా, మ్యాక్స్వెల్, క్రిస్టియన్, జెమీసన్, అలెన్, సామ్స్.


Click it and Unblock the Notifications












