సేవ్ ది రైనోస్:
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో మైదానంలోని కెమెరాలు రోహిత్ శర్మ షూను పదేపదే చూపించాయి. రోహిత్ వేసుకున్న షూపై 'సేవ్ ది రైనోస్' అని రాసి ఉంది. 'సీఇంగ్ పాసిబులిటీస్' అని మరో షూపై రాసుంది. రెండు షూలపై రైనోస్ బొమ్మలు ప్రింట్ చేసి ఉన్నాయి. మొదటగా సేవ్ ది రైనోస్ అని సరిగా కనిపించకపోవడంతో అభిమానులు కాస్త తికమక పడ్డారు. అసలు విషయం తెలుసుకున్నాక అందరూ రోహిత్పై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ తన ట్విటర్లో ఈ విషయంపై స్పందించాడు.

ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా:
'నేను నిన్న మ్యాచ్లో బరిలోకి దిగడానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు.. ఆట కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. క్రికెట్ ఆడడం అనేది నాకు డ్రీమ్. దానిని నెరవేర్చుకున్నా. కానీ ప్రకృతిని కాపాడలనేది మన బాధ్యత. అందరం కలిసికట్టుగా పోరాడితే.. కచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. మన దేశంలో ఇండియన్ రైనోలు అంతరించే స్థితికి చేరుకున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది. మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే నా షూపై అలా రాసుకున్నా' అని రోహిత్ శర్మ రెండు ట్వీట్లు చేశాడు. రోహిత్ ఇచ్చిన మెసేజ్ నెటిజన్లు మనసు దోచుకుంది.

మంచి జరగాలని కోరుకుందాం:
ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ... 'టోర్నీలో ఆరంభ మ్యాచ్ గెలవడం కీలకం. ఆఖరి వరకు పోరాడాం. మాకు లభించిన శుభారంభం చూస్తే మేం కనీసం మరో 20 పరుగులు చేయాల్సింది. కొన్ని తప్పులు చేశాం. అది సహజమే. మార్కో జాన్సన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగల ప్రతిభాశాలి. డివిల్లియర్స్, క్రిస్టియన్ భాగస్వామ్యం విడదీయడం మాకు కీలకం. అందుకే బుమ్రా, బౌల్ట్ను ప్రయోగించాం. కానీ ఆ వ్యూహం పనిచేయలేదు. ఏబీ అద్భుతంగా ఆడాడు. కొత్త ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా ఉండటంతో వారి గురించి తెలుసుకోలేకపోయాం. తటస్థ వేదికల్లో ఆడటం ఎవరికైనా సవాలే. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మంచి జరగాలని కోరుకుందాం' అని అన్నాడు.

రోహిత్ రనౌట్:
ముంబై ఇన్నింగ్స్ 4వ ఓవర్ను స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వేశాడు. చహల్ విసిరిన చివరి బంతిని పాయింట్, కవర్స్ ఫీల్డర్ల మధ్యలో నుంచి లిన్ హిట్ చేశాడు. లిన్ పరుగు కోసం పిలవగానే.. రోహిత్ వేగంగా పిచ్ మధ్యలోకి పరుగెత్తకుంటూ వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని డైవ్ చేస్తూ అడ్డుకున్నాడు. దీంతో లిన్.. రోహిత్ని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. అప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన రోహిత్ మళ్లీ క్రీజులోకి వెళ్లలేకపోయాడు. బంతిని అందుకున్న కోహ్లీ చాకచక్యంగా బౌలర్ చహల్కి అందివ్వడంతో.. అతడు వికెట్లను గిరాటేశాడు. దీంతో రోహిత్ రనౌటయ్యాడు.


Click it and Unblock the Notifications












