
ముంబై: ఏప్రిల్ 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సందడి షురూ అయింది. భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ ముగిసిన వెంటనే క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ కోసం భారత ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి ప్రవేశిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ముంబైలో జట్టుతో కలిశాడు. ఆదివారం రాత్రి పూణేలో మూడో వన్డే ముగియగా.. సోమవారం ముంబై జట్టుతో రోహిత్ చేరాడు.
బీఎండబ్ల్యూ కారులో దర్జాగా ముంబై ఇండియన్స్ టీమ్ బస చేసిన హోటల్కి రోహిత్ శర్మ వస్తున్న వీడియోని ఆ జట్టు ప్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రోహిత్ స్వయంగా కారు నడుపుకుంటూ రాగా.. అక్కడి సిబ్బంది అతడికి స్వాగతం పలికారు. ఆపై రోహిత్ తన గదికి వెళ్ళిపోయాడు. ముంబై స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఆదివారం రాత్రే ముంబైలో జట్టుతో కలిశారు. ముగ్గురూ కూడా ఒకేసారి పూణే నుంచి వచ్చారు.
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. ఒక్క మ్యాచ్ కూడా తన సొంత మైదానం వాంఖడేలో ముంబై ఆడే అవకాశం లేదు. టోర్నీలో అన్ని మ్యాచ్ల్నీ అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే ఆడనున్నాయి.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇందులో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీ చరిత్రలో మరే జట్టు కూడా ఇన్నిసార్లు టోర్నీ విజేతగా నిలవలేదు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలుచుకుంది. ఐపీఎల్ 2020 సీజన్లోనూ ముంబై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.