న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడి చాలా కాలమైందని, అతనితో మళ్లీ ఆడాలనే కోరిక బలంగా ఉందని టీమిండియా సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెలిపాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన అతను ఈసారి ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన ఊతప్ప.. ధోనీతో మళ్లీ ఆడటంతో తన కల నిజమైందని పేర్కొన్నాడు.
'చెన్నై జట్టులో చేరిన సందర్భంగా నాకు స్వాగతం పలికిన అభిమానులందరికీ థ్యాంక్స్. ఇప్పటివరకూ నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడు నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది. ధోనీతో కలిసి ఆడి దాదాపు 12-13 ఏళ్లు అవుతోంది. మహీ రిటైరయ్యేలోపు తనతో కలిసి ఆడి ఈ జట్టుకు టైటిల్ సాధించాలనే కోరిక ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడటం నా అదృష్టం. నేను ఆడుతూ పెరిగిన.. అంబటి రాయుడు, సురేశ్ రైనాతో మళ్లీ ఆడే అవకాశం దక్కింది. ఈసారి చెన్నై తరఫున ఆడి మీ అందర్నీ మరింత ఉత్సాహపరిచేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని ఉతప్ప ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇక, ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచీ ఆడుతున్న రాబిన్ ఉతప్ప.. ఇప్పటివరకు 189 మ్యాచ్లు ఆడాడు. అందులో 24 అర్ధశతకాలతో 4,607 పరుగులు చేశాడు. ఈ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఇక గతేడాది రాజస్థాన్ బ్యాట్స్మన్గా ఆడిన అతడు 12 మ్యాచ్ల్లో 16.33 సగటుతో 196 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఉతప్పను ట్రేడింగ్ పద్ధతిలో చెన్నైకు వదిలేసుకుంది. దాంతో ఈ కర్ణాటక బ్యాట్స్మన్ తన మాజీ కెప్టెన్తో మళ్లీ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
Robbie in #Yellove for the first time! Whistle Poda ready ah, all of you?! #WhistlePodu @robbieuthappa 💛🦁 pic.twitter.com/v0GO2oRrJF
— Chennai Super Kings (@ChennaiIPL) February 21, 2021