
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బెంగళూరు బరిలోకి దిగుతోంది. డాన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పాటిదార్ ఆడుతున్నాడు. మరోవైపు కోల్కతా సారథి ఇయాన్ మోర్గాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు, కోల్కతా జట్లు ఇప్పటి వరకూ 26 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్ల్లో కోల్కతా విజయం సాధించగా.. 12 మ్యాచ్ల్లో బెంగళూరు గెలుపొందింది. బెంగళూరుపై ఓ మ్యాచ్లో కోల్కతా ఏకంగా 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోవైపు బెంగళూరు కూడా ఒక మ్యాచ్లో కోల్కతాపై 213 పరుగులు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోల్కతా ఓ మ్యాచ్లో బెంగళూరుని 49 పరుగులకే కుప్పకూల్చగా.. బెంగళూరు ఓ సందర్భంలో కోల్కతాని 84 పరుగులకే ఆలౌట్ చేసింది. గత ఏడాది ఐపీఎల్లో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ బెంగళూరు జట్టే విజేతగా నిలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తొలిసారి పోటీ పడుతున్నాయి.
చెన్నైలోని చెపాక్ వికెట్ బౌలర్లకు పూర్తి అనుకూలం. గత మ్యాచులు చూసినా ఇదే స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నింగ్స్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్ చేయడానికి కఠినంగా మారుతోంది. స్పిన్నర్లకు పండగే. అందుకే టాస్ గెలిచిన జట్టు ఇక్కడ ఎక్కువగా బ్యాటింగ్ ఎంచుకుంటుంది. చిదంబరం మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 160 పరుగులు చేసినా.. ఆ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంటున్నారు.
తుది జట్లు:
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.
కోల్కతా: శుభమన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ.