
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లోని రాబోయే ఓ మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా సేవలు అందిస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా బ్లూ జెర్సీలో బరిలోకి దిగనున్నట్లు ఆదివారం ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. బ్లూ జెర్సీ ధరించి కోవిడ్ హీరోలకు నివాళి అర్పించనుంది.
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత దేశానికి అండగా నిలువనున్నట్లు కూడా ఆర్సీబీ పేర్కొంది. తమ వంతుగా సాయం చేయడమే కాకుండా విరాళాల సేకరణకు కృషి చేస్తామని తెలిపింది. అందుకోసం కొత్తగా తయారు చేసిన బ్లూ కలర్ జెర్సీని రానున్న మ్యాచ్లో ధరిస్తామని, వాటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వనున్నట్లు ఆర్సీబీ ప్రాంచైజీ వెల్లడించింది. త్వరలోనే ఆర్సీబీ తమ విరాళం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాజస్థాన్ మహమ్మారి పోరాటం కోసం 7.5 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే.
'బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్సిజన్ కొరత, వైద్య పరికరాల అవసరం ఉందో అక్కడ ఆర్సీబీ సాయం అందిస్తుంది. రానున్న ఓ మ్యాచ్లో ప్రత్యేక జెర్సీ ధరించనున్నాం. గతేడాది కరోనా నియంత్రణలో భాగంగా ముందుండి పోరాడిన ఉద్యోగుల గౌరవార్థం ఈ జెర్సీలను ధరించనున్నాం. వీటిని వేలం వేయగా వచ్చిన నిధులను దేశంలోని ఆక్సిజన్ సరఫరా కోసం ఇవ్వనున్నాం. కరోనా కారణంగా దేశంలో ఏమవుతుందో తలుచుకుంటే భయమేస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. వాక్సిన్ వేసుకోండి' అని ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన కోహ్లీసేన 5 మ్యాచులు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉంది. మహమ్మారితో పోరాడుతున్న దేశానికి.. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్తో పాటు ఐపీల్లో ఆడుతున్న పలువురు క్రికెటర్లు, ఫ్రాంచైజీలు మద్దతుగా నిలిచారు.