
దుబాయ్: విశ్లేషణలు, సమాచారం, పాయింట్లపై ఆధారపడి మ్యాచ్లు ఆడలేమని.. పరిస్థితులను బట్టి ముందుకు వెళితేనే విజయం సాధిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రణాళికలను కచ్చితంగా అమలు చేస్తున్నామా లేదా అనే వాటిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నాడు. ఐపీఎల్ 2021 తొలి దశలో ఎలా ఆడామో ఇప్పుడూ అలాగే ఆడతామని.. అంతే ప్యాషన్, పట్టుదలతో బరిలోకి దిగుతామని కోహ్లీ చెప్పాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఈరోజు మొదలవుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచుకు దుబాయ్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.
సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'ఐపీఎల్ 2021 తొలి భాగంలో ఆడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ ఇప్పుడు అందుబాటులో లేరు. వారి స్థానాల్లో శ్రీలంక ప్లేయర్స్ వానిండు హసరంగ, చమీర దుష్మంత జట్టులోకి వచ్చారు. వీరికి యూఏఈ లాంటి పిచ్లపై ఎలా ఆడాలో బాగా తెలుసు. వీళ్ల నైపుణ్యాలు మా జట్టుకు బాగా ఉపయోగపడనున్నాయి. వీరి చేరికతో జట్టు మరింత బలోపేతంగా తయారవుతుంది' అని కోహ్లీ తెలిపాడు.
'ఐపీఎల్ టోర్నీలో ఇప్పటికే ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండటంతో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచినా.. ఎనిమిదో మ్యాచ్ను కూడా అంతే పట్టుదల, ప్రొఫెషనలిజమ్తో ఆడాలి. ఒకవేళ ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలైనా.. ఆరో మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు కాబట్టి ప్రతీది ఇలాగే జరుగుతుందని ఆశించొద్దు. బయట నుంచి అనేక విశ్లేషణలు, సమాచారం, పాయింట్లు.. అనే లెక్కలు ఉంటాయి. వాటిపై ఆధారపడి మ్యాచ్లు ఆడలేం. ఆ సమయానికి మనం ఎలా ఉన్నాం, ఎలా స్పందిస్తున్నాం, మన ప్రణాళికలు ఏంటి? వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామా లేదా అనే వాటిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
ఈ సీజన్లో ఇప్పటికే మంచి విజయాలు సాధించామని, ఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. బెంగళూరు కొత్త బ్లూ జెర్సీని ఆవిష్కరించడానికి వర్చువల్ ప్రెస్ మీట్లోవిరాట్ పాల్గొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాప్లో దుమ్మురేపిన ఆర్సీబీ.. టైటిల్ ఆశలు రేకెత్తిస్తుంది. ఫస్టాఫ్లో 7 మ్యాచ్ల్లో 5 విజయాలందుకున్న ఆజట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే సెకండాఫ్లో ఏడు మ్యాచ్ల్లో మూడింటిలో నెగ్గినా ప్లేఆఫ్ చేరొచ్చు. దీంతో ఈసారైనా ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉన్న ఈసారి కూడా ఆర్సీబీ ఫైనల్కు చేరడంలో విఫలమైతే.. ఇక అంతే సంగతులు.
ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీకి చెత్త రికార్డే ఉంది. 2013లో ఆర్సీబీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లీ.. ఇప్పటివరకు జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. 2016 సీజన్లో అద్వితీయమైన ఆటతో జట్టును ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేర్చగలిగాడు. ఆ తర్వాత మళ్లీ గత సీజన్లో ప్లే ఆఫ్స్ వరకూ చేరుకోగలిగినా.. టైటిల్ ఫైట్కు మాత్రం తీసుకోలేకపోయాడు. 2017, 2019లో అయితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2018లో మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 'ఈ సాలా కప్ నమ్దే' అనుకుంటూ రావడం, ఒట్టి చేతులతో వెళ్లడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది.