
ముంబై: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఐపీయల్ ప్లేయర్లకు వ్యాక్సినేషన్ అంశంపై బీసీసీఐ ఆలోచన చేస్తుందని, తర్వలో దీనికి సంబంధించి ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్టు ఆయన వెల్లడించారు.
కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో ఎవ్వరికీ తేలీదు కాబట్టి ఆటగాళ్ల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వ్యాక్సినేషన్ ఉత్తమమైన మార్గమని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం ఆరు వేదికల్లోనే ఐపీఎల్ నిర్వహిస్తున్నామని, ఆ దిశగా బయో బబుల్ ఏర్పాటు చేశామని శుక్లా చెప్పారు. టీమ్స్లో సభ్యుల సంఖ్యను కూడా పెంచినట్లు తెలిపారు. ప్రేక్షకులు లేకుండానే టోర్నీ కొనసాగుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2021లో పాల్గొనబోతున్న ముగ్గురు ప్లేయర్స్ ఇప్పటికే వైరస్ బారిన పడటంతో.. ఆటగాళ్లతో సహా ఆయా ప్రాంచైజీ యాజమాన్యాలు, బీసీసీఐ ఆందోళన చెందుతున్నాయి. తొలుత కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణాకు వైరస్ నిర్ధారణ కాగా.. అతరువాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా తేలింది. తాజాగా ఆర్సీబీ యువ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్కు సైతం కరోనా సోకింది. దీంతో ఆయా ఫ్రాంఛైజీలు, బీసీసీఐ కరోనా కట్టడి మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే ఆటగాళ్లకు వ్యాక్సినేషన్ ప్రస్థావనకు తెరపైకి తెచ్చింది.
ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఇప్పటికే లీగ్ కోసం జట్లతో చేరిన కొందరు ఆటగాళ్లు.. క్వారంటైన్ పూర్తిచేసి ముమ్మర సాధన చేస్తున్నారు. రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతన్నాయి. ఇక లేటుగా వచ్చిన ఆటగాళ్లు మాత్రం క్వారంటైన్ సమయం గడుపుతున్నారు. ఏప్రిల్ 9న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.