
అహ్మదాబాద్: వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించనని, జట్టు విజయమే తనకు చాలా ముఖ్యమని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. శివమ్ మావితో నాలుగైదేళ్లు ఆడాను కాబట్టి అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసని పేర్కొన్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షా కేవలం 41 బంతుల్లో 82 పరుగులు చేశాడు. శివమ్ మావి వేసిన తొలి ఓవర్లోనే షా ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్మన్ అతడు. గతంలో అజింక్య రహానే ఈ ఘనత సాధించాడు.
మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ... 'ఇన్నింగ్స్ ముందే ధైర్యంగా ఆడాలని నిర్ణయించుకున్నా. చెత్త బంతుల కోసం వేచి చూశా. శివమ్ మావితో నాలుగైదేళ్లుగా ఆడుతున్నా. అందుకే అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసు. మొదటి నాలుగు బంతులు పుల్ లెంగ్త్లో వచ్చాయి. తర్వాత షార్ట్ బాల్ ఆడేందుకు సన్నద్ధం అయ్యాను. కానీ మావి ఆ బంతులు వేయలేదు. ఈ పిచ్పై ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో బంతి బ్యాట్ పైకి కాస్త ఆలస్యంగా వస్తోంది. ఆఫ్ స్టంప్, అవుట్ సైడ్ బంతులు ఎక్కువగా రావడంతో స్వేచ్ఛగా ఆడగలిగా' అని తెలిపాడు.
'నేనెప్పుడూ వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించను. జట్టు విజయమే నాకు ముఖ్యం. అందరూ వీరేందర్ సెహ్వాగ్ ఆడుతావ్ అని అంటారు. అయితే ఇప్పటి వరకు నాకు సెహ్వాగ్తో మాట్లాడే అవకాశం రాలేదు. అవకాశం వస్తే తప్పకుండా మాట్లాడతా. ఎందుకంటే సెహ్వాగ్కు కూడా తొలి బంతికి బౌండరీ కొట్టడం లేదా పరుగులు చేయడాన్ని ఇష్టపడతాడు. అవ్సరమైన సలహాలు తీసుకుంటా' అని ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా పేర్కొన్నాడు.
'పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడని మనందరికి తెలుసు. అతని మీద నమ్మకం ఉంచితే అద్భుతాలు చేయగలడు. షాకు సాధారణంగా ఆడాలని చెప్పాం. ఇటువంటి మ్యాచ్ల్లో రన్రేట్ గురించి ఆలోచిస్తాం. క్రికెట్ను ఆస్వాదిస్తూ.. మీ శక్తి మేరకు పరుగులు చేయండి అని ఆటగాళ్లకు చెబుతుంటాం. లలిత్ యాదవ్ మంచి ఆల్రౌండర్. అతని బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ నేర్చుకుంటాడు. బెంగళూరులో మేం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయాం. కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా' అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చెప్పాడు.