
టాప్-3 ఖరారు:
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 10 విజయాలు.. మూడు ఓటములను ఎదుర్కొంది. 10 విజయాలతో ఢిల్లీ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచుల్లో.. తొమ్మిది విజయాలు, నాలుగు ఓటములతో 18 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచుల్లో 8 విజయాలు, 5 ఓటములతో 16 పాయింట్లను ఖాతాలో వేసుకుని మూడో స్థానంలో ఉంది. ఈ మూడు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే మొదటి రెండు స్థానాల కోసం పోటీపడనున్నాయి. ఢిల్లీకి 20 పాయింట్లు ఉన్నాయి కాబట్టి.. చెన్నై, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో గెలిచినా.. లేదా ఢిల్లీ తమ చివరి మ్యాచులో ఓడినా మొదటి రెండు స్థానాల్లో కచ్చితంగా ఉండనుంది. చెన్నై చివరి మ్యాచులో గెలిచి.. ఢిల్లీ ఓడితే అగ్రస్థానంలో ధోనీసేన ఉంటుంది. నెట్ రన్రేట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో బెంగళూరు తొలి రెండు స్థానాల్లో నిలవడం కాస్త కష్టమే.

రెండో దశలో మారిన కేకేఆర్ తలరాత:
విజయంతో ఐపీఎల్ 2021 సీజన్ను ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కరోనా వైరస్ మహమ్మారితో వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. రెండో దశలో కేకేఆర్ తలరాత మారిందనే చెప్పొచ్చు. వరుసగా రెండు భారీ విజయాలతో ఫామ్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచుల్లో ఆరు విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉండి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. ఒక్క విజయం కేకేఆర్ తలరాతను మార్చనుంది.

ఆశలు కోల్పోయిన వేళ ముంబైకి అద్భుత విజయం:
ఐపీఎల్ చరిత్రలోనే ఐదు సార్లు ట్రోఫీని అందుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2021లో అంచనాలను అందుకోవడం లేదు. ఎప్పుడూ టాప్లోనే ఉండే ముంబై ఈసారి ప్లే ఆఫ్స్ కోసమే కష్టపడాల్సి వస్తోంది. ప్లే ఆఫ్స్ మీద ఆశలు కోల్పోయిన వేళ.. మంగళవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి మళ్లీ రేసులోకి వచ్చింది. ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన ముంబై కేవలం ఆరు విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లను మాత్రమే సాధించింది. మిగిలిన ఏకైక మ్యాచ్లో సన్రైజర్స్ మీద ఘన విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

కోల్కతా ప్లే ఆఫ్స్ చేరాలంటే:
ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్లో మిగిలిన నాలుగో స్థానం సాధించే అవకాశం ఎక్కువగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకే ఉంది. అందులోనూ కోల్కతా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై, కోల్కతా ఆరేసి విజయాలతో 12 పాయింట్లు సాధించాయి. కేకేఆర్కు మెరుగైన రన్రేట్ ఉండటంతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచుల్లో రాజస్థాన్తో కేకేఆర్.. సన్రైజర్స్తో ముంబై తలపడతాయి. రాజస్థాన్ మీద కేకేఆర్ గెలిచి.. సన్రైజర్స్ మీద ముంబై ఓడిపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండానే కోల్కతాకు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. రాజస్థాన్పై కేకేఆర్, సన్రైజర్స్ మీద ముంబై భారీ విజయాలు సాధిస్తే.. ఇరు జట్ల పాయింట్లు 14 అవుతాయి. అప్పుడు నెట్ రన్రేట్ కీలకమవుతుంది. ఎక్కువ రన్రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్స్లోకి వెళుతుంది.

ముంబై అవకాశాలు ఇలా:
ఒకవేళ రాజస్థాన్ మీద కేకేఆర్ ఓడిపోయి, సన్రైజర్స్ మీద ముంబై గెలిస్తే.. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా రోహిత్ సేన ప్లే ఆఫ్స్లోకి వెళ్లిపోతుంది. రాజస్థాన్ చేతిలో కేకేఆర్, సన్రైజర్స్పై ముంబై ఓటమిపాలైతే.. పంజాబ్ కూడా రేసులోకి వస్తుంది. పంజాబ్ తన చివరి మ్యాచ్లో చెన్నై మీద భారీ విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్ నాలుగో స్థానం ఎంట్రీ కాస్త సంక్లిష్టమవుతుంది. కేకేఆర్ (12 పాయింట్లు), ముంబై (12), రాజస్థాన్ (12), పంజాబ్ (12) సమానంగా ఉంటాయి. ఈ సమయంలో నెట్ రన్రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం కేకేఆర్కు ఎక్కువ నెట్ రన్రేట్ ఉన్నా.. విజయాపజయాలపై ఆ సమీరణాలు మారనున్నాయి. మొత్తానికి చివరి మ్యాచ్ జరిగేవరకు నాలుగో బెర్త్ ఖరారు అయ్యేలా లేదు.


Click it and Unblock the Notifications












