
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగలనుంది. చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు గాయం అయినట్టు తెలుస్తోంది. భువీ తొడ కండరాలు పట్టేసినట్టు సమాచారం. భువీకి గాయం అయినట్టు మ్యాచ్ జరుగుతుండగా.. వ్యాఖ్యాతలు చెప్పారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలుస్తోంది. అయితే పంజాబ్ మ్యాచ్లో భువీ బ్యాటింగ్ చేసేది అనుమానమే.
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. గాయం కారణంగానే మరో ఓవర్ వేయలేదని సమాచారం. గత మూడు మ్యాచులలో తేలిపోయిన భువీ.. ఈ మ్యాచ్ ద్వారానే ఫామ్ అందుకున్నాడు. ఇంతలోనే అతడికి గాయం అవ్వడంతో సన్రైజర్స్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మోకాలి గాయం కారణంగా సన్రైజర్స్ మరో స్టార్ పేసర్ టీ నటరాజన్ కూడా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో అతడు బరిలోకి దిగలేదు.

చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలలో 120 పరుగులకు ఆలౌటైంది. సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. దాంతో పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (22; 25 బంతుల్లో 2x4), యువ బ్యాట్స్మన్ షారుఖ్ ఖాన్ (22; 17 బంతుల్లో 2x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఖలీల్ అహ్మద్ 3/21, అభిషేక్ శర్మ 2/24 రాణించారు.