అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు) భారీ హాఫ్ సెంచరీ చేయగా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (46; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో హర్ప్రీత్ బార్ 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ కూడా తీయకుండా.. ఏకంగా 53 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో హర్షల్ బౌలింగ్ చేసి ఫిఫ్టీ కొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. జట్టులోకి కొత్తగా వచ్చిన ప్రభ్సిమ్రన్ సింగ్ (7) త్వరగానే అవుట్ కావడంతో కొంత ఒత్తిడికి లోనైంది. కానీ ఆ తర్వాత క్రీజులోకొచ్చిన క్రిస్ గేల్(46) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా బౌండరీల వర్షం కురిపించాడు. కైల్ జేమీసన్ వేసిన ఆరో ఓవర్లో 5 ఫోర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా ధాటిగానే ఆడడంతో పవర్ప్లే ఆఖరికి పంజాబ్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లలోనూ వీలుచిక్కినప్పుడల్లా ఇద్దరూ బౌండరీలు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
ధాటిగా ఆడిన గేల్.. 11వ ఓవర్ వేసిన డేనియల్ సామ్స్ బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12వ ఓవర్లో జేమిసన్ బౌలింగ్లో హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ మరోసారి డకౌట్ అయ్యాడు. పూరన్ ఈ సీజన్లో నాలుగో డకౌట్ కావడం విశేషం. ఆపై రాహుల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక 14వ ఓవర్లో షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో 5 పరుగులు చేసిన దీపక్ హుడా పాటిధార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో చహల్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ డకౌట్గా వెనుదిరిగాడు.
ఈ సమయంలో కెప్టెన్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. ధాటిగా పరుగులు చేస్తూ పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్లో హర్షల్కు చుక్కలు చూపించాడు. ఏకంగా 2 ఫోర్లు, ఓ సిక్స్తో చెలరేగాడు. అతడికి తోడు కొత్త కుర్రాడు హర్ప్రీత్ బ్రార్ చివరి బంతిని థర్డ్ మ్యాన్ దిశగా స్టాండ్స్లోకి బాది పంజాబ్ ఇన్నింగ్స్కు మంచి ఎండింగ్ ఇచ్చాడు. ఇటీవల చెన్నైతో మ్యాచ్లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్న హర్షల్.. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్ రెండు వికెట్లు తీయగా డేనియల్ సామ్స్, యుజువేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.