టాస్ గెలిస్తే.. బ్యాటింగే
దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది పంజాబ్ కింగ్స్. ఆడిన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తుక్కు రేగ్గొట్టింది. 221 భారీ పరుగులను ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, దీపక్ హుడా రెచ్చిపోయి ఆడారు. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే 220 ప్లస్ స్కోర్ చేయడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్ లైనప్ మొత్తం ఫుల్ ఫామ్లో ఉంది. అదే ఫామ్ చెన్నైపైనా చూపించగలిగితే.. మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయమే. చెన్నై జట్టులో ఇద్దరు కీలక ప్లేయర్లు ఆడట్లేదు. జట్టుకు దూరం అయ్యారు. లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెన్డార్ప్ ఆడట్లేదు.
డు ఫ్లెసిస్-రుతురాజ్ గైక్వాడ్.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎప్పట్లాగే డు ఫ్లెసిస్-రుతురాజ్ గైక్వాడ్లో ఇన్నింగ్ను ఆరంభించే అవకాశం ఉంది. తొలి మ్యాచ్లో వారిద్దరూ విఫలమయ్యారు. డుఫ్లెసిస్ సుదీర్ఘకాలం నుంచీ జట్టు బ్యాటింగ్ లైనప్లో పిన్ పాయింట్గా ఉంటున్నాడు. తొలి మ్యాచుల్లో నిరాశ పరిచినప్పటికీ.. టోర్నమెంట్ కొనసాగే కొద్దీ రాటుదేలడం అతని స్పెషాలిటీ. గైక్వాడ్ తొలి మ్యాచ్లో తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించనప్పటికీ- మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసంతో ఉంది. గైక్వాడ్ వద్దనుకుంటే రాబిన్ ఉతప్పను ఓపెనర్గా పంపించే అవకాశం ఉంది.
మిడిలార్డర్లో ఆ ముగ్గురూ..
జట్టు మిడిలార్డర్లో ఆల్ రౌండర్ సురేష్ రైనా, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు, కేప్టెన్ ఎంఎస్ ధోనీ చోటు దాదాపు ఖాయమే. మిడిలార్డర్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. తొలి మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ భరతం పట్టిన రైనా.. ఈ మ్యాచ్లోనూ అదే స్థాయిలో మెరుపు ఇన్నింగ్ ఆడతాడనే అంచనాలు ఉన్నాయి. అంబటి రాయుడిని తక్కువగా అంచనా వేయలేం. ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాడంటే భారీ షాట్లతో సుదీర్ఘ ఇన్నింగ్ను ఆడగలడు. టీమ్ కేప్టెన్ ఎంఎస్ ధోనీ ఫామ్ను కోల్పోవడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్లో ధోనీ ఎలా ఆడతాడనేది.. జట్టు గెలుపోటములపై ప్రభావాన్ని చూపుతుంది.
ఆల్ రౌండర్లుగా..
డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, సామ్ కుర్రన్.. ఆల్రౌండర్లుగా బరిలో దిగడం దాదాపు ఖాయమే. బ్రావో మినహా మిగిలిన ముగ్గురూ ఫామ్లో ఉన్నారు. ఢిల్లీ కేపిటల్స్లో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లలో సామ్ ధాటిగా ఆడాడు. జట్టు స్కోరు 180 ప్లస్ అందుకోవడానికి ప్రధాన కారకుడయ్యాడు. బౌలింగ్, బ్యాటింగ్లో రవీంద్ర జడేజాతో సమానంగా అతను ఆడగలడు. స్పెషలిస్ట్ బౌలర్లుగా శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ బరిలో తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. నిలకడ లేమి ఆ జట్టును వేధిస్తోంది.
రెండు జట్ల ప్రాబబుల్స్ ఇలా..
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్స్లో డుఫ్లెసిస్, గైక్వాడ్/రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, సామ్ కుర్రన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఆడొచ్చు. పంజాబ్స్ కింగ్స్లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికొలస్ పూరన్, షారుఖ్ ఖాన్, జైరె రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. రెండు జట్టల్లో పెద్దగా మార్పులేమీ ఉండే అవకాశాలు లేవు.