
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లను కోల్పోయి అందుకుంది. హార్డ్ హిట్టర్లతో నిండివున్న ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి స్కోర్బోర్డుపై తక్కువ పరుగులను నమోదు చేయగలిగడానికి కారణం ఆర్సీబీ బౌలర్లే. మహ్మద్ సిరాజ్, కైలే జెమిసన్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు.
డేనియల్ క్రిస్టియన్, యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. ఈ ముగ్గురి బంతులను ముంబై బ్యాట్స్మెన్లు ఎదుర్కొనలేకపోయారు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ అయిదు వికెట్లను పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను తీసుకున్నాడు. పించ్ హిట్టర్లుగా గుర్తింపు ఉన్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలను పెవిలియన్ దారి పట్టించాడు. చివరలో మార్కో జెన్సేన్ను అవుట్ చేయడంతో అయిదు వికెట్ల క్లబ్లో చేరాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
ఈ సీజన్ తొలి మ్యాచ్లో అయదు వికెట్లను పడగొట్టడంపై అనుసరించిన వ్యూహాలను హర్షల్ పటేల్ వెల్లడించాడు. స్లోయర్ బంతులే తన ప్రధాన బలమని చెప్పాడు. పదేళ్లుగా తాను క్రికెట్లో కొనసాగుతున్నప్పటికీ.. నిలకడ లేమి తనను వేధించిందని, దాన్ని అధిగమించానని అన్నాడు. వైవిధ్యంతో కూడిన బంతులను సంధించగలుగుతున్నానని పేర్కొన్నాడు. 15, 20 రోజులుగా యార్కర్లపై దృష్టి పెట్టానని, డెత్ ఓవర్లలో బ్యాట్స్మెన్లను కట్టి పడేయడానికి అదే ప్రధాన కారణమని చెప్పాడు. ఇదివరకు బౌలింగ్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం కొరవడిందని, ఆర్సీబీ కేప్టెన్ విరాట్ కోహ్లీ తనన ప్రోత్సహించారని అన్నాడు.
డెత్ సెషన్లో కనీసం రెండు ఓవర్లను బౌలింగ్ చేయాల్సి ఉంటుందని తనకు టీమ్ మేనేజ్మెంట్ ముందే సూచించిందని, దానితో తాను మానసికంగా ప్రిపేర్ అయ్యానని చెప్పాడు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో డెత్ సెషల్లో బౌలింగ్ చేయడం కష్టతరమని, అయినప్పటికీ.. కోహ్లీ ఇచ్చిన సలహాలతో లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బౌలింగ్ చేశానని హర్షల్ పటేల్ చెప్పాడు. తొలి మ్యాచ్లోనే అయిదు వికెట్లను సాధించడం వల్ల అందరి దృష్టీ తనపైనే ఉంటుందని , ఈ సీజన్లో మొత్తంలో రాణించడానికి శ్రమిస్తానని చెప్పుకొచ్చాడతను.