ముంబై: ఏప్రిల్ 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సందడి షురూ అయింది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి ప్రవేశిస్తున్నారు. చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడబోతున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు మరోసారి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. తన కుటుంబంతో కలిసి రోహిత్ సోమవారం ముంబై జట్టుతో కలిశాడు.
తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ కూతురు సమైరా హెల్మెట్ పెట్టుకుని సందడి చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. 'మినీ పుల్ షాట్ ఆడిన చిన్నారి. ముంబై ఇండియన్స్ 'క్యూటెస్ట్' సపోటర్. ఐపీఎల్ 2021 ప్లాన్ సిద్ధంగా ఉంది' అని ట్వీట్ చేసింది. వీడియోలో తన తండ్రి బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ సమైరా పుల్ షాట్ ఆడింది. డాడీ పుల్ షాట్ ఎలా కొడతారని రితిక అడగ్గా.. సమైరా ఆడి చూపించింది. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
From a mini pull-shot 😍 to an MI cheer chant ➡️ Sammy’s #IPL2021 plan is ready ✅#OneFamily #MumbaiIndians @ImRo45 @ritssajdeh pic.twitter.com/vPnTCjLVLc
— Mumbai Indians (@mipaltan) March 31, 2021
సోమవారం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుతో కలిశాడు. బీఎండబ్ల్యూ కారులో దర్జాగా ముంబై టీమ్ బస చేసిన హోటల్కి రోహిత్ వస్తున్న వీడియోని ఆ జట్టు ప్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రోహిత్ స్వయంగా కారు నడుపుకుంటూ రాగా.. అక్కడి సిబ్బంది అతడికి స్వాగతం పలికారు. ఆపై రోహిత్ కుటుంబంతో కలిసి తన గదికి వెళ్ళిపోయాడు. ఇక ముంబై స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఆదివారం రాత్రే ముంబైలో జట్టుతో కలిశారు.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇందులో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీ చరిత్రలో మరే జట్టు కూడా ఇన్నిసార్లు టోర్నీ విజేతగా నిలవలేదు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ గెలుచుకుంది. ఐపీఎల్ 2020 సీజన్లోనూ ముంబై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా కప్ కొట్టాలని చూస్తోంది.
హైదరాబాద్ ఫ్యాన్స్ చాలా ప్రేమని ఇచ్చారు.. పెర్ఫార్మెన్స్ రూపంలో తిరిగిచ్చేయాలి! లేకపోతే లావైపోతా!