
ముంబై: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాట్స్మన్ చెమటోడ్చుతున్నారు. లీగ్లో ఎన్నడూ లేని విధంగా గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన చెన్నై.. ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇందుకోసం ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా నెట్స్లో చెమటోడ్చారు. ఈ ఇద్దరు ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చెన్నై తన ట్విటర్లో పోస్ట్ చేసింది. మహీతో కోచులు స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సిలు చర్చలు జరిపారు.
ప్రాక్టీస్ చేసేముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన బ్యాటును సరిచేసుకున్నాడు. డ్రిల్లింగ్ మిషన్ సాయంతో తన బ్యాటు బరువును తగ్గించాడు. ఆపై మైదానంలో చెక్ చేశాడు. ఇక వ్యక్తిగత కారణాలతో గత సీజన్ ఆడని సురేష్ రైనా కూడా మూడు బ్యాట్లతో మైదానంలోకి దిగాడు. ఆపై భారీ షాట్లు ఆడాడు. పక్కనే ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై ఆటగాళ్ల బ్యాటింగ్ సాధనను పర్యవేక్షించాడు. రైనా తిరిగి టీమ్లోకి రావడం చెన్నై జట్టుకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు దూరమయినా.. ఐపీఎల్ 2021 కోసం కొత్తగా మొయిన్ అలీ, క్రిష్ణప్ప గౌతమ్ లాంటి స్టార్ ప్లేయర్స్ చెన్నై టీమ్తో చేరారు. ఇద్దరూ బ్యాటింగ్, బౌలింగ్ చేయడం చెన్నైకి కలిసొచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ మాత్రం 14వ సీజన్కు దూరమయ్యాడు. వరుస బబుల్స్కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్నట్లు హేజిల్వుడ్ స్పష్టం చేశాడు. ఈ నెల 10న ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై.. ముంబైలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.
చతేశ్వర్ పుజారా కూడా సన్నద్ధమవుతున్నాడు. తనపై టెస్ట్ క్రికెటర్గా ఉన్న ముద్రను తొలగించుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా సహచర ఆటగాళ్లతో కలిసి నెట్స్లో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. పుజారా ఆన్ ఫైర్ అనిపిస్తున్నాడు. నెట్స్లో అతను భారీ షాట్లు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.