ప్రాక్టీస్ ఆరంభం:
సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో పలు ఫ్రాంచైజీలు బయోబుడగలను ఏర్పాటు చేసి తమ ఆటగాళ్లను యూఏఈకి తరలిస్తున్నాయి. ఐపీఎల్ 2021 కోసం చెన్నై టీమ్ ఆగస్టు 13న దుబాయ్ చేరుకుంది. వారం రోజుల పాటు దుబాయ్లోని పామ్ హోటల్లో చెన్నై ప్లేయర్స్ క్వారంటైన్ అయ్యారు. క్వారంటైన్ గడువు గురువారం పూర్తవడంతో దుబాయ్లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో చెన్నై ప్లేయర్స్ ప్రాక్టీస్ ఆరంభించారు. గత మూడు రోజులుగా చెన్నై ఆటగాళ్లు దుబాయ్ మైదనంలో సాధన చేస్తున్నారు. చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆటగాళ్ల సాధనను దగ్గరుండి మరి పరీక్షించాడు.

భారీ సిక్సర్లు బాదిన మహీ:
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, పేసర్ దీపక్ చహర్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్నర్ కరన్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు శనివారం సాయత్రం ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీస్ సందర్భంగా మహీ కసిగా కనిపించాడు. బంతి పడడమే ఆలస్యం.. భారీ సిక్సర్లు సంధించాడు. స్పిన్,పేస్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడాడు. మహీ కొట్టిన ఓ బంతి మైదానం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. 'ధోనీ ఆవాజ్' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 'సిక్సులు బాదేందుకు మహీ సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ టీమ్స్ జర పైలం' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రెండో స్థానంలో చెన్నై:
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్లో ఏడు మ్యాచ్లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ కూడా ఆడలేదు. దాంతో మిగిలిన మ్యాచ్ల్లోనైనా ధోనీ చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఏడు మ్యాచ్ల్లో బ్యాటింగ్లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్గా మాత్రం ఆకట్టుకున్నాడు.

ఐపీఎల్ ప్రోమోలోనూ మహీ సందడి:
ఐపీఎల్ 2021 రెండో భాగం మరో నెల రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ యాజమాన్యం తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోను వదిలింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఆ ప్రమోషనల్ వీడియోలో అదరగొట్టాడు. 'అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని' ఓ బాలీవుడ్ సినిమా డైలాగ్తో కూడిన ప్రచార చిత్రంలో సరికొత్త అవతారంలో మహీ కనువిందు చేశాడు. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే మిగిలిన 14వ సీజన్లో.. డ్రామా, సస్పెన్స్, క్లైమాక్స్తో పాటు హెలికాఫ్టర్ టేకాఫ్ కూడా ఉంటుందంటూ ధోనీ ప్రమోషనల్ వీడియోలో పేర్కొన్నాడు. ఏం బాధపడకండి ఇప్పుడే ఇంటర్వెల్ అయింది.. అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అంటూ రచ్చ చేశాడు. ధావన్, రోహిత్ షాట్లతో పాటు ప్లే ఆఫ్, సూపర్ ఓవర్లు అన్ని ఉన్నాయని.. మరోసారి ఐపీఎల్ 2021ను ఎంజాయ్ చేయండని ధోనీ చెప్పాడు.


Click it and Unblock the Notifications












