
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ డకౌట్తో ఆరంభించాడు. వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మహీ పరుగులు ఏమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. పేసర్ అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి ధోనీ ఔట్ అయ్యాడు. బంతిని వికెట్ల మీదకు ఆడుకుని మహీ బోల్డ్ అయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న మహీ.. డకౌట్గా వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు. 2010 ఐపీఎల్ సీజన్లో రెండు సార్లు మహీ డకౌట్గా నిష్క్రమించాడు. రాజస్తాన్ రాయల్స్తో చెన్నైలో జరిగిన మ్యాచ్లో ధోనీ డకౌట్ కాగా.. అదే స్టేడియంలో అదే ఏడాది ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా మహీ డకౌట్ అయ్యాడు. ఇందులో రాజస్తాన్ రాయల్స్తో గోల్డెన్ డక్గా ఔట్ కాగా, డేర్డెవిల్స్పై రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.
ఇక 2015లో ముంబై ఇండియన్స్తో ముంబైలో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ తర్వాత ఆరేళ్లకు మళ్లీ మహీ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ధోనీ రెండో బంతికి ఔటయ్యాడు. అవిశ్ ఖాన్ వేసిన 16 ఓవర్ మూడో బంతికి మహీ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా మహీ ఐపీఎల్ టోర్నీలో డకౌట్ అవ్వడం ఇది నాలుగోసారి. ధోనీ గతేడాది ఆగష్టు 15న అన్ని ఫార్మాట్ల ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మహీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు.
మహీకి ఐపీఎల్ 2021 చివరి సీజన్ కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ధోనీకి ఇదే చివరి సీజన్ కాదని తాజాగా అన్నారు. 'మహీకి ఇదే చివరి ఏడాది అని నాకు అనిపించడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము ఇప్పటికిప్పుడు మరో ప్లేయర్ వైపైతే చూడటం లేదు. ఇప్పటివరకు ధోనీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు' అని చెన్నై సీఈవో స్పష్టం చేశారు.