
ముంబై: ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 14వ ఎడిషన్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడబోతున్నాడు. గత ఫిబ్రవరి 18న జరిగిన మినీ వేలంలో అలీని రూ. 7కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2021లో సీఎస్కేకు ఆడుతున్న అలీ.. ఆ టీమ్ జెర్సీ వేసుకోలేనని చెప్పాడు. ఆ జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉండటమే దీనికి కారణం.
మొయిన్ అలీ ఓ ముస్లిం. ఆల్కహాల్ తీసుకోవడం, వాటిని ప్రోత్సహించడం ఇస్లాం మత ఆచారాలకు విరుద్ధం. దీంతో అలీ ఇంగ్లండ్ టీమ్కే కాదు.. ఏ దేశవాళీ జట్టుకు ఆడినా కూడా ఆల్కహాల్ బ్రాండ్ జెర్సీలు ధరించడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జెర్సీపై ఎస్ఎన్జే 10000 బ్రాండ్ లోగో ఉంది. ఇది చెన్నైలో ఉన్న ఎస్ఎన్జే డిస్టిలరీస్కు చెందినది. ఈ లోగోను తొలగించాలని అలీ కోరగా.. అందుకు సీఎస్కే యాజమాన్యం అంగీకరించింది. ఇంతకముందు అలీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఆడినప్పుడు కూడా ఆల్కహాల్ లోగో లేని జెర్సీనే ధరించి ఆడాడు.
గత మూడు సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన మొయిన్ అలీ.. తొలిసారి చెన్నైకి ఆడుతున్నాడు. అలీ ఇప్పటివరకు 19 మ్యాచ్లాడి 309 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఎంఎస్ సారధ్యంలోని సీఎస్కేకు ఆడేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అలీ ఇటీవలే చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలో తమ ఆటతీరు మెరుగుపడుతుందని చాలామంది క్రికెటర్లు భావిస్తారని అలీ తెలిపాడు. ముంబై వేదికగా ఏప్రిల్ 10న జరిగే మ్యాచ్లో చెన్నై జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్కు అటు జట్లు, ఇటు అభిమానులు సిద్ధమవుతున్న వేళ పలు జట్లలోని ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా మహమ్మారి బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు కరోనా సోకింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు ఒకరు కూడా వైరస్ బారినపడ్డాడు. అయితే మిగతా జట్టు సభ్యులు, కోచింగ్ స్టాఫ్కు వైరస్ సంక్రమించకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కరోనా సోకిన ఆటగాడు ఐసోలేషన్లో ఉన్నాడని, ఎవరితోనూ కలవలేదని ఫ్రాంచైజీ తెలిపింది.