మహీ వారసుడు జడేజానే:
తాజాగా ఓ క్రీడాఛానెల్తో మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో రెండు, మూడేళ్లు ఆడతాడని మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఆ తర్వాత క్రియాశీలక పాత్ర పోషించకపోవచ్చు. అప్పుడు చెన్నై పరిస్థితి ఏంటి?. కాబట్టి ఇప్పటి నుంచే చెన్నై.. తమ జట్టును ఎవరు నడిపించగలరనే విషయంపై దృష్టి సారించాలి. నేనైతే రవీంద్ర జడేజానే ఎంపిక చేస్తా. నా దృష్టిలో అతడే చెన్నై జట్టును ముందుండి నడిపిస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది' అని అన్నాడు. ఐపీఎల్ 2021లో మెరుపు లాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో అదరగొడుతున్న జడేజాను 'అత్యుత్తమ ఫీల్డర్' అంటూ వాన్ ఇప్పటికే కితాబిచ్చిన సంగతి తెలిసిందే.
అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు:
'బలమైన జట్టును రవీంద్ర జడేజా నిర్మిస్తాడు. అలాగే బ్యాట్, బంతి, ఫీల్డింగ్తో పాటు అతడి ఆలోచనా విధానం కూడా బాగుంటుంది. ఆటపై మంచి పరిజ్ఞానం కలిగిన ఆటగాడు జడేజా. అవసరాన్ని బట్టి ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు, ఎప్పుడైనా బౌలింగ్ చేయగలడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఆటతీరును బట్టి ఫీల్డింగ్లోనూ మార్పులు చేసుకోగల ఆటగాడు. అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు. జడేజా అంత మంచి క్రికెటర్' అని మైకేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో జడేజా రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా.. 4 క్యాచ్లు పట్టిన సంగతి తెలిసిందే.
2 వికెట్లు, 4 క్యాచ్లు:
సోమవారం రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా (2/28) కీలక సమయంలో రెండు వికెట్లు తీయడంతో పాటు ఫీల్డింగ్లోనూ నాలుగు కళ్లు చెదిరే క్యాచ్లు అందుకొని చెన్నై గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు 87 వద్ద దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్ (49), శివమ్ దూబే (17)లను జడేజా అవుట్ చేశాడు. అంతేకాకుండా మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కత్ల క్యాచులను అందుకున్నాడు. ఉనద్కత్ క్యాచ్ అందుకున్న తర్వాత తాను పట్టిన క్యాచ్ల సంఖ్యను చెప్పడానికి జడేజా తన నాలుగు వేళ్లను చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన సీఎస్కే.. '2 వికెట్లు, 4 క్యాచ్లు.. జడ్డూ వెరీ గుడ్డూ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది.